హీరో శివాజీకి కౌంటర్: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మతలబు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తనపై సినీ నటుడు శివాజీ ఒత్తిడి పెడుతున్న నేపథ్యంలో అదును చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాత పెట్టారనే మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై పోరాటం చేయాలని, తనపై చేస్తే లాభం లేదని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై ఓ విసురు విసిరారు.
ప్రత్యేక హోదాపై పోరులో హీరో శివాజీ కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంకయ్య నాయుడు చిరాకుపడిన సందర్భం కూడా ఉంది. తన పోరును శివాజీ బిజెపిపైనే ఎక్కు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరిద్దరు పార్లమెంటు సభ్యులను ఆయన విమర్శించినప్పటికీ బిజెపిపైనే ఆయన గురి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శివాజీ పోరాటాన్ని సమర్థిస్తున్నానని కూడా చెప్పారు.

ప్రత్యేక హోదాపై తనపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి పెరుగుతున్న విషయాన్ని గమనించే ఉంటారు. దీంతో ఆయన దాన్ని టిడిపి ఎంపిలపైకి గురి పెట్టి విసిరినట్లు భావిస్తున్నారు. బిజెపితో పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదాపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసే స్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు కూడా అందుకు సిద్ధంగా లేరు. ఈ స్థితిలో బంతిని పవన్ కళ్యాణ్ కోర్టులో పడేసే ప్రయత్నాలు చేశారు.
ఇప్పుడు అదును చిక్కడంతో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులపై అస్త్రాన్ని సంధించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు పోరాటం చేయడం లేదని, వారికి వ్యాపారమే ముఖ్యంగా మారిందని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. పవన్ కళ్యాణ్పై టిడిపి పార్లమెంటు సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దాన్ని ఆసరా చేసుకుని బిజెపిపై తాడోపేడో తేల్చుకోవాలనే రీతిలో టిడిపి ఎంపీలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు భావించాల్సి ఉంటుంది. తెలంగాణలో బిజెపి తెలుగుదేశం పార్టీతో దోస్తీని కొనసాగించడానికి ఏ విధమైన సంసిద్ధతతో లేదు. నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తే ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అలా విభేదాలు పెరిగేలా ఒత్తిడి చేయడమే పవన్ కళ్యాణ్ ఉద్దేశమా అనే ప్రశ్న ఉదయిస్తోంది.












Click it and Unblock the Notifications