పవన్ కల్యాణ్కు కంటి శస్త్రచికిత్స:విశ్రాంతి సూచించిన వైద్యులు
Recommended Video
హైదరాబాద్: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటికి గురువారం శస్త్రచికిత్స జరిగింది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఈ సర్జరీ నిర్వహించారు.
కొన్ని నెలల క్రిందట ఆయన ఎడమ కంటిపై కురుపు ఏర్పడింది. అయినప్పటికీ పవన్ అలాగే ప్రజా పోరాటయాత్రలో పాల్గొంటున్నారు. అయితే కంటి మీద కాంతి, ధూళి పడకుండా నల్లని కళ్లద్దాలు వాడుతున్నారు. ఈనేపథ్యంలో కంటి నొప్పి అధికం కావడంతో పవన్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఈ కురుపును పరిశీలించిన వైద్యులు గురువారం శస్త్రచికిత్స చేసి కురుపును తొలగించారు.
సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో పవన్ ను గురువారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని పవన్కు వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆయన ఈనెల 16 నుంచి తూర్పుగోదావరి ప్రజాపోరాట యాత్రలో పవన్ పాల్గొనాల్సి ఉంది. వైద్యుల సలహా నేపథ్యంలో పవన్ యాత్ర యథావిథిగా కొనసాగుతుందా లేక మార్పులకు గురవుతుందా అనే విషయమై శుక్రవారం ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
పవన్ తన కంటికురుపు గురించి గత నెలలో జరిగిన రంగస్థలం సక్సెస్ మీట్ లో తొలిసారి చెప్పారు. కంటి సమస్యకు సర్జరీ అవసరమని వైద్యులు అప్పుడే సూచించగా పవన్ ప్రజాపోరాట యాత్ర కారణంగా ఆ ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గురువారం పవన్ కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో జనసేన శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.