పవన్ కళ్యాణ్ క్లియర్: చంద్రబాబు, మోడీల వైపే
హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించడానికి పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకు వస్తారని చాలా మంది భావించారు. మొత్తం రాజకీయ పార్టీలను నిరాకరిస్తూ కొత్త రక్తంతో, కొత్త నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెడతారని భావించారు. కానీ, ఆయన ప్రసంగం తీరు గానీ, ఆ తర్వాత రాజకీయ పార్టీల ప్రతిస్పందనలు గానీ చూస్తే అలా అనిపించడం లేదు.
చాలా స్పష్టంగా ఆయన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైపు ఉన్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబుపై ఆయన వ్యాఖ్యలు చేయకుండా ప్రసంగాన్ని దాటేశారు. కాంగ్రెసును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన కూతురు కవితపై, కుమారుడు కెటి రామారావుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
కాంగ్రెసు హఠావో, దేశ్ బచావో అనే నరేంద్ర మోడీ నినాదంతో పవన్ తన ప్రంసగాన్ని ముగించారు. కాంగ్రెసు మినహా మిగతా అన్ని పార్టీలతోనూ కలిసి పనిచేస్తానని ప్రకటించారు. చంద్రబాబుతో సహా అన్ని పార్టీల నాయకులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన సిద్ధాంతాలు కూడా కాదు, తన ప్రజల కోసం పెట్టే అంశాలను అంగీకరించే పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. దీన్నిబట్టి ఆయన కచ్చితంగా తెలుగదేశం, బిజెపిల వైపు ఉన్నారనే అభిప్రాయం కలుగతోంది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై, ఆయన పార్టీపై తెలుగుదేశం, బిజెపి నాయకులు ప్రతిస్పందించిన తీరు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం శుభ పరిణామమని, పవన్ కళ్యాణ్ కలిసి వస్తే ఆహ్వానిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళీమోహన్ చెప్పారు. పవన్ కళ్యాణ్పై తాను ఇప్పుడే ప్రతిస్పందించబోనని తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్పై పెద్దగా స్పందించలేదు. చంద్రబాబు నుంచి కచ్చితమైన ఆదేశాలు వెళ్లడం వల్లనే పవన్ కళ్యాణ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదని అంటున్నారు.
ఇదిలావుంటే, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడారు. పవన్ నినాదాన్ని వెంకయ్య నాయుడు ఆహ్వానించారు. తనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై చాలా సున్నితంగా స్పందించారు. తన మాటలను ఓ పత్రిక వక్రీకరించిందని చెప్పారే తప్ప పవన్ కళ్యాణ్ చూసి మాట్లాడాల్సిందని అనలేదు. పవన్ కళ్యాణ్తో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని ఆయన నర్మగర్భంగా చెప్పారు. మొత్తం మీద వెంకయ్య నాయుడు పవన్ కళ్యాణ్పై తన సహజశైలికి భిన్నంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్తో స్నేహానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆయన పోటీ చేస్తే, ఆయన అనుచరులను పోటీకి పెడితే మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు సమాచారం. శాసనసభకు ఎన్నికల్లో 25 స్థానాలు పవన్ కళ్యాణ్ అనుచరులకు కేటాయిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఒప్పందం కుదిరిందా, లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది.