పవన్ పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ చేసేలా : 8 జిల్లాల్లో సుడిగాలి పర్యటన: బీజేపీ అభ్యర్ధుల బాధ్యత సైతం..!
సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఎదురు దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పరీక్షగా మారబోతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ..బీజేపీ గెలుపుకు పని చేసిన పవన్ .. 2019 ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో పాటుగా బీఎస్పీతో కలిసి పోటీ చేసారు. తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. ఇక, ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే పవన్ ప్రజల్లోకి వచ్చారు. కేడర్ లో ధైర్యాన్ని నింపారు. తమకు అధికారమే లక్ష్యం కాదని స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు బీజేపీతో పొత్తుతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్న పవన్ కు ఇది తన రాజకీయ భవిష్యత్ తో పాటుగా జనసేనాని సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. తమ అభ్యర్ధులనే కాదు..బీజేపీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతలు ఇప్పుడు పవన్ మీదనే ఉంది. దీంతో..పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం 8 రోజుల పాటు సుడిగాలి ప్రచారానికి సిద్దమయ్యారు.
Recommended Video
బీజేపీ..జనసేన అభ్యర్ధులు బరిలో..
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. కీలక జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జనసేన పార్టీ సమన్వకర్తలకు అప్పగించారు. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఇరుపార్టీల నేతల బలాబలాలను పరిశీలించి, ఎవరు బలమైన అభ్యర్థి అనుకుంటే వారికే సీటు కేటాయించాలని నిర్ణయించారు. అయితే, టీడీపీ వామపక్ష పార్టీలతో కలిసి బరిలో నిలవటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అధికార వైసీపీ మాత్రం పూర్తిగా ఏకపక్ష విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కొత్తగా ఆర్దినెన్స్ లతో పాటుగా ముందస్తుగానే అన్ని చర్యలు ప్రారంభించింది. సమయం చాలా తక్కువగా నిర్దేశించటం సైతం అందులో భాగమే. దీంతో..ఇప్పుడు బీజేపీ జాతీయ నేతలు ఏపీలోని స్థానిక సంస్థలను పెద్దగా సీరియస్ గా తీసుకోకపోయినా..ఇక్కడి ఫలితాలు..పవన్ శక్తి సామర్ధ్యాలపైన మాత్రం అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
8 జిల్లాల్లో పవన్ పర్యటన..
ప్రచార పర్వంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలకం కానున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలు సహా 8 జిల్లాల్లో పవన్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారని తెలుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తిగానే ప్రచారం ప్రారంభించనున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బీజేపీ తరఫున ప్రచారానికి ఏకంగా కేంద్ర మంత్రులే రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తారని చెబుతున్నా..పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో సాధ్యం కాకపోవచ్చు. దీంతో..ఇప్పుడు జనసేనతో పాటుగా బీజేపీ అభ్యర్ధులను సైతం గెలిపించుకొని..ప్రజల్లో తనకున్న ఇమేజ్ ను ..తన శక్తిని కేంద్రానికి చాటుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాన్ కు ఏర్పడింది. ఈ ఫలితాల ఆధారంగా జనసేన..బీజేపీ మధ్య భవిష్యత్ పొత్తులు..నిర్ణయాలు ఆధార పడే అవకాశం ఉంది. ఒక రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ మీద..సీఎం జగన్ పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రచారంలో సైతం పవన్ కీలకంగా మారనున్నారు.
పవన్ పొలిటికల్ ఫ్యూచర్ తో లింకు..
2019 ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోవటం జనసేనకు భారీ నష్టం చేసింది. అయితే, ఇప్పుడు తొమ్మిది నెలల జగన్ పాలన మీద ప్రజాభిప్రాయం వెల్లడి కానుంది. ఈ ఫలితాల్లో జనసేన .. బీజేపీ కూటమి ప్రభావం చూపించగలిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంగా భారీ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొని అటు టీడీపీ-వామపక్ష కూటమి , అదే విధంగా ఇటు బీజేపీ..జనసేన కూటమి పోటీ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల పైనే జనసేన..బీజేపీ కూటమి ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. దీంతో..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో తమ కూటిమిని గెలిపించే బాధ్యత తీసుకున్నారు. మరి..పవన్ సక్సెస్ ఆధారంగా జనసేన రాజకీయ భవిష్యత్.. రానున్న రోజుల్లో బీజేపీతో మైత్రి డిసైడ్ కానుంది.