పవన్ కళ్యాణ్ కిటికీలోంచే! ఏపీ సర్కారుపై సెటైర్లు!! చంద్రబాబు ఫోన్, ఏమన్నారంటే?
విశాఖపట్నం: నగరంలో పరిస్థితులు రాజకీయంగా వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నగరంలోనే ఉండటంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర.. జనసేన కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసుల్లో తెలిపారు.
నోటీసుల రూపంలో అవార్డు అంటూ పవన్ కళ్యాణ్
జనసేన కార్యకర్తల చర్యలతో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. జనసేనాని తోపాటు పార్టీ నేలకు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. విశాఖ పరిధిలో ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసుల వైఖరిపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిలబడితే.. పోలీసు నోటీసుల రూపంలో అవార్డు దక్కిందన్నారు.
హోటల్ కిటికీలోంచే పవన్ కళ్యాణ్ అభివాదం
పోలీసుల ఆంక్షల నేపథ్యంలో హోటల్ గదిలోని కిటికీలోంచి రోడ్డుపై ఉన్న జనసేన కార్యకర్తలు, అభిమానులకు చేతులు ఊపుతూ, అభివాదం కనిపించారు పవన్ కళ్యాణ్. హోటల్లోనే పవన్ ఉన్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోలీసులు, ఏపీ సర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆర్కే బీచ్లో తిరగాలని ఉందంటూ ఏపీ సర్కారుపై పవన్ సెటైర్లు
శ్రీ థానోస్ గారి ఘనతర నాయకత్వం కింద పనిచేస్తున్న ఏపీ పోలీసులు జనసేన కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారని వ్యంగ్యం ప్రదర్శించారు. ర్యాలీలు లేవు, సభలు లేవు... ఈ హోటల్ గది కిటీకీలోంచి బయటకి చూసే వెసులుబాటును మాత్రం కల్పించారు అంటూ ఎద్దేవా చేశారు. అంతేగాక, "ఈ సందర్భంగా నా మనసులోకి ఓ ఆలోచన వచ్చింది.. కాస్త తాజా గాలి పీల్చుకునేందుకు ఆర్కే బీచ్లో తిరగాలని అనిపిస్తోంది.. అందుకైనా అనుమతిస్తారా?' అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. అందుకు జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు స్పందిస్తూ నేను రెడీ బ్రదర్... పద వెళదాం" అంటూ రాసుకొచ్చారు. 'ఉడతా ఉడతా ఊచ్
ఎక్కడ
కెళ్తోవోచ్
రుషికొండ
మీద
జాంపండు
కోసుకొస్తావా
మా
వైసిపికి
ఇస్తావా
మా
థానోస్
గూట్లో
పెడతావా'
పేర్కొన్నారు.
పవన్ కళ్యాన్కు చంద్రబాబు ఫోన్.. ఏమన్నారంటే?
విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసు ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిపై పవన్తో చర్చించారు. జనసేన నేతలపై కేసులను చంద్రబాబు తప్పుపట్టారు. పార్టీ అధ్యక్షుడికి ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులు, నేతల అరెస్టు గురించి చంద్రబాబుకు పవన్ వివరించారు. అధికార పార్టీ.. పోలీసులతో పాలన చేయాలనుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సరికాదన్న చంద్రబాబు.. ప్రతిపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పని చేస్తోందని ధ్వజమెత్తార. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వారి వారి కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని, దాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై మొదటి నుంచి ప్రభుత్వం విధానం ఇలాగే ఉంటుందని పవన్తో చంద్రబాబు అన్నారు. పవన్కు నోటీసులు ఇవ్వడం సరికాదని, పవన్ పర్యటనపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
సంఘీభావం తెలిపిన నేతలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు
మరోవైపు, తమకు సంఘీభావం తెలిపిన అందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన పార్టీల నేతలకు ధన్యవాదాలు చెప్పారు. వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అందరూ చూశారని, జనసేన నేతల అరెస్టును, ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు ఖండించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ నేతలు సోము వీర్రాజు, సునీల్ దేవధర్, సత్యకుమార్, మాధవ్కు ధన్యవాదాలు తెలిపారు పవన్. ప్రభుత్వ చర్యలను ఖండించిన లోక్సత్తా జేపీకి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కృతజ్ఞతలు చెప్పారు. పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తున్న జన సైనికులను అభినందించారు.