పవన్ వ్యాఖ్యల కలకలం- ఆ భేటీపైనే : ఎంత పెద్ద వారైనా దేహీ అంటేనే : వంగి వంగి..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు..ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. నర్సాపురం మత్య్సకార సభలో ఆయన ముఖ్యమంత్రి జగన్ ఇగో గురించి మాట్లాడుతూ హాహభావాలు ప్రదర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు...ప్రదర్శించిన హాహభావాలు తాజాగా సీఎం జగన్ తో హీరోలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సమయంలో చోటు చేసుకున్నవిగా విశ్లేషణలు మొదలయ్యాయి.
Recommended Video
పరోక్షంగా ఆ భేటీ గురించి
పవన్ నేరుగా ఆ అంశాన్ని..చిరంజవి పేరు ప్రస్తావించకపోయనా...ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ మీటింగ్ లో చోటు చేసుకున్న పరిణామాల పైనే అనే విషయం స్పష్టమవుతోందనే చర్చ వినిపిస్తోంది. పవన్ వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న సమయంలోనే...వైసీపీ నేతలు సమస్యలు వారే సృష్టిస్తారు... పరిష్కారం చూపించి మార్కులు కొట్టేస్తారని వ్యాఖ్యానించారు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదనేది వారి విధానమన్నారు. ఎంత పెద్ద వారైనా దేహీ.. దేహీ అని అడుక్కోవాలని అనుకుంటారని చెప్పుకొచ్చారు. అప్పుడే జగన్ ఈగో సంతృప్తి చెందుతుంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
తల వంచేందుకు సిద్దంగా లేను
చావనైనా చస్తా, తల వంచేందుకు సిద్ధంగా లేను. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని పవన్ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి టీం భేటీ అయింది. ఆ సమయంలో చిరంజీవి సీఎం వద్ద వినియంగా తమ సమస్యలను ప్రస్తావిస్తూ..వాటి పరిష్కారానికి సీఎం జగన్ ను అభ్యర్ధించటం సినీ సర్కిల్స్ తో పాటుగా రాజకీయంగానూ చర్చకు కారణమైంది. చిరంజీవి అంతగా ప్రాధేయపడాలా అంటూ చంద్రబాబు మొదలు పలువురు నేతలు ప్రశ్నించారు. సమస్యను సృష్టించి..వారే పరిష్కరించినట్లుగా చేస్తున్నారంటూ పలువురు టీడీపీ నేతలు విమర్శించారు.
చిరంజీవి అంతగా ప్రాధేయపడాలా
సీనీ ప్రముఖులను అవమానపరిచారంటూ రాజకీయంగా వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, వైసీపీ నేతలు మాత్రం జగన్ తో చర్చల తరువాత సినీ హీరోలు సమస్యలు పరిష్కారం అయ్యాయని ... జగన్ కు థాంక్స్ చెబుతూ పోస్టులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిరంజీవి సీఎం జగన్ కు చేతులు జోడిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం కోరుతున్న వీడియో హల్ చల్ చేసింది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారనేది ఇండస్ట్రీ టాక్. తాను సీఎంను ప్రాధేయపడ్డానంటూ వస్తున్న వ్యాఖ్యల పైన చిరంజీవి ఎక్కడా స్పందించలేదు.
పవన్ వ్యాఖ్యలపై మరోసారి చర్చ
కొందరు మాత్రం చిరంజీవి వినయంగానే ఉంటారంటూ చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ తరువాత పలువురు సినీ ప్రముఖులు ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించారు. అయితే, ఇప్పుడు సమస్యలు పరిష్కారం అయి..ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సిద్దం అవుతున్న సమయంలో..పవన్ మరోసారి పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.