అది అనుమానమే..ఈ పని ఎప్పుడో చేయాల్సింది: పవన్
హైదరాబాద్: ప్రత్యేకే హోదా లాంటి కీలక విషయాల్లోనూ ఏపీలో రాజకీయాలకు అతీతంగా పోరాటం జరగకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు రెండూ.. క్రెడిట్ తమకంటే తమకే దక్కాలన్న పంతంతో వేర్వేరుగానే పోరాటం చేస్తూ వస్తున్నాయి.
పిల్లవాడిని అనుకుంటున్నారా: మోడీ-బాబులపై పవన్ హెచ్చరిక, రాహుల్ వైపు టర్న్
Recommended Video
రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా ఈ రెండు పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టకపోవడమే కేంద్రానికి ఏపీపై మరింత చులకనభావం పెరిగేలా చేసిందన్న వాదనలున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.
రాజకీయాల కోసమే 'హోదా':
ఏపీ రాజకీయాలపై బుధవారం మీడియాతో మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దాని చుట్టూ గూడుకట్టుకుంటున్న రాజకీయాలన్ని కేవలం ఆయా పార్టీల ప్రయోజనాల కోసమే తప్ప అందులో చిత్తశుద్ది లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.
అది అనుమానమే:
ఏపీ ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలన్ని ఒకే వేదిక మీదకు వస్తేనే ఫలితం ఉంటుందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అయితే అలాంటి వేదికను సృష్టించేందుకు తనలాంటి వారు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయన్నది అనుమానమే అని చెప్పారు.
ఈ పని ఎప్పుడో చేయాల్సింది..:
'ఎవరి ఎజెండా వారిది. ఎవరి భయాలు వారివి. కేసుల గురించి అంతా భయపడుతున్నారు.నిజానికి నాకు కూడా ఐటీ నోటీసులొచ్చాయి. నా డ్రైవర్ వేగంగా కారు నడిపాడని కేసుపెట్టారు' అని పవన్ చెప్పుకొచ్చారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీల పోరాటం ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఇక రాజీనామాల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటికే చాలా టీడీపీ కేంద్రమంత్రులు ఎప్పుడో రాజీనామాలు చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.
అందులో తప్పేంటి?:
ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి ప్రస్తావిస్తూ.. యువత ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తోందన్నారు.
థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందని చెప్పారు. ఇక కేసీఆర్, చంద్రబాబు ఒక్కటవుతున్నారా? అన్న ప్రశ్నకు.. కేంద్రంతో సయోధ్య లేనప్పుడు మరో తెలుగు సీఎంతో కేసీఆర్కు సఖ్యత ఉంటే తప్పేంటన్నారు పవన్.