అటు మోడీతో ఇటు పార్టీ పైన: పవన్ కళ్యాణ్ బిజీ బిజీ
హైదరాబాద్/అహ్మదాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తు లేదా అవగాహన కోసం చర్చలు జరుపుతూనే.. మరోవైపు పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారించారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం విశాఖపట్నం జిల్లాలో పవన్ అభిమానులు పార్టీ సభ్యత్వ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇతర జిల్లాల్లోను సభ్యత్వాలు జోరందుకున్నాయి. మెగా అభిమానులు ఎక్కువ మంది చిరంజీవితో కంటే పవన్తో ఉండేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల 27వ తేదీన తాను రాసిన 'ఇజం' పుస్తకాన్ని పవన్ లాంచ్ చేయనున్నారు. దీని కోసం పవన్ అభిమానులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తాను ఏ పార్టీ వైపో పరోక్షంగా చెప్పిన పవన్ కళ్యాణ్.. పుస్తకావిష్కరణ సమయంలో నేరుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
కాగా, పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. అక్కడి నుండి ఉదయం అహ్మదాబాద్ వెళ్లారు. సాయంత్రం ఆయన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications