పవన్ కల్యాణ్ పొలిటికల్ ఫ్రీలాన్సర్, జనసేనకు సిద్ధాంతం లేదు, టీడీపీ కోసమే పార్టీ: అమర్నాథ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడునెలల్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత ఏంటీ అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రత్యామ్నాయం అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ-జనసేన పొత్తు కూడా అపవిత్ర కలయికగా అభివర్ణించారు. శుక్రవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు.

సిద్ధాంతం లేదు
జనసేన పార్టీకి సిద్ధాంతం అంటూ ఏదీ లేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఆ పార్టీని ఎందుకు పెట్టారో అధినేత పవన్ కల్యాణ్కే తెలియదన్నారు. కానీ ఆ పార్టీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మేలు జరిగిందని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావం టీడీపీ కోసమే జరిగిందనే అనుమానం వస్తోందని చెప్పారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ కోసం పనిచేయగా.. 2024లో బీజేపీతో కలిసి పనిచేస్తారట అని ధ్వజమెత్తారు.

పొలిటికల్ ఫ్రీ లాన్సర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు పవన్ కల్యాణ్కు పట్టవని గుడివాడ అమర్నాథ్ ఫైరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి పవన్ కల్యాణ్ పట్టించుకోరు అని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ను చూస్తుంటే పొలిటికల్ ఫ్రీ లాన్సర్ మాదిరిగా కనిపిస్తున్నారని విమర్శించారు. సగం రాజకీయాలు, సగం సినిమాలు.. ఇతరత్రా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం మారింది..
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే భ్రమలో జనసేన, బీజేపీ ఉన్నాయని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రభుత్వం మారి ఏడు నెలలు గడిచాయని చెప్పారు. కానీ ఆ పార్టీలు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనే భ్రాంతిలో ఉన్నాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో టీడీపీ ఏం చేసిందో ప్రజలు కళ్లారా చూశారన్నారు. కుటుంబ పాలన, అవినీతి పార్టీ అంటే ఎవరిదో అందరికీ తెలుసు అని చెప్పారు.












Click it and Unblock the Notifications