చిరంజీవినే ఎదిరించా, అలా చేయకుంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు: బాబుపై జనసేనాని నిప్పులు
Recommended Video

వంతాడ/జగ్గంపేట: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని వాళ్లు ముఖ్యమంత్రి కాలేరని, కారాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం జగ్గంపేట బహిరంగ సభలో అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ మోకాళ్లకు మొక్కుతారా.. సిగ్గులేదా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయమని, తనకు ఎలాంటి భయం లేదన్నారు.
టీడీపీ, బీజేపీ కుమ్ములాటలో ఏపీ నష్టపోయిందని చెప్పారు. బీజేపీ మీద తనకు ఎంతో కోపం, విసుగు ఉన్నాయని చెప్పారు. ఏపీలో అధర్మ, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుకు జనసేన ఎందుకు అండగా నిలుస్తుందని ప్రశ్నించారు. 2019లో మీరే రావాలి అంటూ చంద్రబాబుకు హోర్డింగులు పెడుతున్నారని, మళ్లీ అవినీతి చేసేందుకు రావాలా అని ప్రశ్నించారు.
వెళ్లి నరేంద్ర మోడీకి చెప్పా
2014 ఎన్నికలకు ముందు గాంధీ నగర్లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించానని, లేదంటే యువతలో నిస్పృహ పెరిగి, వేర్పాటువాదులు వస్తాయని చెప్పానని పవన్ చెప్పారు. మోడీ ఏపీకి ఏదైనా చేస్తారని నమ్మానని, కానీ చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అంతకుముందు చంద్రబాబు ఎప్పుడు కూడా తమతో కలిసి రాలేదని చెప్పారు. ఏపీలో రూ.3వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.
చిరంజీవినే ఎదిరించా
పరిశ్రమలపై ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని పవన్ నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు బదులు సీఎం బెదిరిపోతున్నారన్నారు. నేను నా అన్నయ్య చిరంజీవినే ఎదిరించిన వాడిని అని, ఏపీ కోసం మోడీని కూడా ఎదిరిస్తానని చెప్పారు. మోడీ నాకేమైనా అన్నయ్యా లేక బంధువా అని నిలదీశారు.
అలా చేయకుంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు
వంతాడలో అడ్డగోలుగా లాటరైడ్ ఖనిజాన్ని తవ్వేస్తున్నారని, రూ.3వేల కోట్ల ఖనిజాన్ని తవ్వేశారని, అయినా సీఎం పట్టించుకోలేదని, ఆండ్రూ కంపెనీవాడు అక్కడ అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్తుంటే అడ్డంకులు కల్పించి మట్టి పోసాడని, వాడికి నేను ఒక్కడే చెబుతున్నానని, అవినీతి చేస్తే మీ తోలు తీసు కాళ్లు విరగ్గొట్టకుంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని హెచ్చరించారు. చంద్రబాబు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
వంతాడ మైనింగ్ పరిశీలన
అంతకుముందు, వంతాడ అక్రమై మైనింగ్ను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే బాధ్యతతో కూడిన మైనింగ్ విధానం తీసుకు వస్తామని చెప్పారు. ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో మైనింగ్ ఉంటే ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. లాటరైడ్ ముసుగులో బాక్సైట్ తరలిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications