పవన్ కల్యాణ్ ఎంట్రీ: నష్టం చంద్రబాబుకా, జగన్కా?
విజయవాడ: పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దింపితే ఎవరు నష్టపోతారనే చర్చ అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందా, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి పరిస్థితి ఏమవుతుందని, కాంగ్రెసు పార్టీకి నూకలు చెల్లినట్లేనా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. పవన్ కల్యాణ్కు బిజెపికి మధ్య రహస్య అవగాహన ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైవు, బిజెపి జగన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తమ పరిస్థితి ఏ మాత్రం మెరుగు కాకపోవడంతో కాంగ్రెసు పార్టీ నాయకులు అటు జగన్కు, ఇటు పవన్ కల్యాణ్కు ఆహ్వానం పలుకుతున్నారు. పవన్ కల్యాణ్ కాంగ్రెసుతో జత కట్టే అవకాశం ఏ మాత్రం లేదని అంటున్నారు. అయితే, మునిగిపోయిన నావతో పయనించడానికి జగన్ ఇష్టపడుతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో చిరంజీవి భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.
ఇప్పటికిప్పుడైతే చంద్రబాబు, జగన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. అయితే పవన్ కల్యాణ్ బిజెపి సాయంతో బరిలోకి దిగితే ఇరు పార్టీలు కూడా దెబ్బ తినే అవకాశాలున్నాయని అంటున్నారు. బిజెపి సీనియర్ నేతలను పార్లమెంటుకు పోటీ చేయించి, పవన్ కల్యాణ్కు రాష్ట్రాధికారాలు ఇవ్వడానికి సిద్ధపడితే అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరగవచ్చునని అంటున్నారు.

ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు ఇప్పటికే కాపు నాయకులను, శాసనసభ్యులను చేరదీస్తున్నారు. జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ కాపు నాయకులను ఆయన తన చెంత చేర్చుకుంటున్నారు. అన్ని వర్గాల మద్దతు పొందదడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నప్పటికీ కాపు సామాజిక వర్గం ఆయనను తమ నాయకుడిగానే చూస్తున్నారు.
చంద్రబాబు మంత్రివర్గంలో కాపులకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. దాంతో కాపులు పవన్ కల్యాణ్ సొంతంగా బరిలోకి దిగినా కూడా కాపు సామాజిక వర్గం చేజారిపోకూడదనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ వస్తున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును, జగన్ను సవాల్ చేస్తూ బరిలోకి దిగితే క్షేత్ర స్థాయిలో కాపు సామాజిక వర్గం కాపు నాయకుల కారణంగా చంద్రబాబు వైపు ఉంటుందా అనేది అనుమానమే.
జగన్కు తన తండ్రి కారణంగా కాపుల నుంచి మద్దతు ఉంది. అయితే, కాపు నేతలు తన నుంచి జారిపోతున్న నేపథ్యంలో ఆయన అదనంగా జరిగే నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. కాపు సామాజిక వర్గం కోస్తాంధ్రలోనే బలంగా ఉంది కాబట్టి పవన్ కల్యాణ్ బరిలోకి దిగకపోతే ఆ వర్గం చంద్రబాబుకు మద్దతు తెలిపే వాతావరణం నెలకొని ఉంది. దానివల్ల పవన్ కల్యాణ్ వల్ల ఆయనకు జరిగే నష్టం ఏమీ ఉండదు.
అయితే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత బలంగా పెరిగితే మాత్రం జగన్ నష్టపోతారనేది చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ బరిలోకి రాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడే అవకాశాలుంటాయి. పవన్ కల్యాణ్ వస్తే ఆ ఓట్లు జనసేనకు పడవచ్చు. ఈ రకమైన నష్టం జగన్కు జరుగుతుంది.
బిజెపి అటు పవన్ కల్యాణ్తోనో ఇటు జగన్తోనో నడవాల్సి ఉంటుంది. లేదంటే చంద్రబాబుతో పొత్తును కొనసాగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగా పెరిగితే మాత్రం చంద్రబాబుతో పాటు బిజెపి కూడా నష్టపోవాల్సి వస్తుంది. అయితే, కాంగ్రెసు నుంచి బిజెపిలోకి వచ్చిన సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబుతో పొత్తును ఇష్టపడడం లేదు.
కేంద్ర నాయకత్వం పొత్తును కొనసాగిస్తుండడం వల్ల వాళ్లు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు రావడం లేదు. కానీ అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది ఎంత దూరం పోతుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏమైనా, పవన్ కల్యాణ్ రాజకీయ ఆరంగేట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పునే తెస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications