16న బీజేపీ-జనసేన కీలక భేటీ: ఢిల్లీ పర్యటనపై పవన్ కళ్యాణ్, బూతు మీడియం అంటూ వైసీపీపై..
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాజా ఢిల్లీ పర్యటన కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో జనసేన నేతలు, కార్యర్తలను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాబోయే 2,3 రోజుల్లో విజయవాడలో కీలక సమావేశం జరుగుతుందని చెప్పారు.

భయపడం.. తెగించే వచ్చాం..
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగితే అందరూ ఖండించాలని.. లేదంటే రాష్ట్రంలో పాశవికమైన పాలన అవుతుందని, మరింత పెట్రేగిపోతారని అన్నారు.
పాలేగాళ్ల రాజ్యాన్ని, ఫ్యాక్షన్ దోరణిని ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. తాము భయపడమని.. రాజకీయాల్లోకి తెగించే వచ్చామని చెప్పారు. మార్పురాకుంటే బలమైన సమాధానం చెబుతామని అన్నారు పవన్ కళ్యాణ్.

అధికారం శాశ్వతం కాదంటూ హెచ్చరిక
అధికారం శాశ్వతం కాదని. అధికారంలోంచి దిగిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండని పవన్ హెచ్చరించారు. ద్వారంపూడి మదమెక్కిన మాటలు ఆయన మర్చిపోవచ్చేమో కానీ.. తనకు గుర్తుంటుందని చెప్పారు. ఆడపడచులు, నాయకుల మీద పడిన దెబ్బలు తనకు గుర్తుంటాయని అన్నారు.

16న బీజేపీ-జనసేన కీలక సమావేశం
జనసేన-బీజేపీ కీలక సమావేశం జనవరి 16న విజయవాడలో ఉంటుందని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని పవన్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో రాస్ట్ర సమస్యలు, పెట్టుబడులు వెనక్కిపోవడం గురించి కేంద్ర పెద్దలకు చెప్పినట్లు తెలిపారు. అమరావతి రైతులు రోడ్డున పడ్డ విషయం చెప్పామని తెలిపారు.

ప్రజాధనం వృథా.. వైసీపీ నేతల కోసమే..
అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు సూచించారని పవన్ చెప్పారు. ప్రధాని ఆశయాలు ఏపీలో కనిపించట్లేదని అన్నారని తెలిపారు. కేంద్రం సాయం కావాలని తాను కోరినట్లు తెలిపారు. గ్రామ గ్రామానికి సచివాలయం పెట్టినప్పుడు.. మళ్లీ సచివాలయం ఎందుకు మార్చడం అని ప్రశ్నించారు. రాజధాని మార్చడం వల్ల ప్రజా ధనం వృథా తప్ప మరేం లేదని అన్నారు పవన్ కళ్యాణ్. రాజధానిని వైజాగ్ ప్రజలు కోరుకోలేదని.. అక్కడ భూములున్న వైసీపీ నాయకులేనని అన్నారు. మూడు రాజధానులని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని అన్నారు.

వైసీపీ బూతు మీడియం.. రాపాకపై ఇలా
వైసీపీ నేతలు నోరు తెరిస్తే బూతులేనని, వారు ఇంగ్లీష్ మీడియం కాదు.. బూతు మీడియం నడుపుతున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రజలను ఇలాంటి నేతలను గెలిపించకూడదని అన్నారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుపై మీడియా ప్రశ్నించగా.. ఆయనపై ఎన్ని ఒత్తిళ్లున్నాయోనని పవన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications