రాజధానిని అడ్డుకుంటాం, చూస్తూ ఊరుకోం: చంద్రబాబుకు పవన్ తీవ్ర హెచ్చరిక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం '2013 భూ సేకరణ చట్టం - పరిరక్షణ' పేరిట విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. లక్ష మంది రైతులకు సంబంధించిన అంశాలపై పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు
తన సభలకు భద్రత కుదరదని చెప్పే పోలీసులపై తనకెలాంటి వ్యతిరేకతా పవన్ లేదన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్ యార్డు లేదన్న పవన్.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని అన్నారు.
చావడానికైనా సిద్ధమే
ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని, పోరాటానికి సిద్ధమని పవన్ వ్యాఖ్యానించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించేవారిని భయపెడుతున్నారన్నారు.
చంద్రబాబు అప్పుడలా.. ఇప్పుడిలా..
సమాజంలో కనిపించే దేవుడు రైతు అని, అటువంటి రైతును కన్నీళ్లు పెట్టించి, వారి భూముల నుంచి వాళ్లను బయటకు పంపించి వేయడం చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని పవన్ అన్నారు. నాడు చంద్రబాబుతో మాట్లాడినప్పుడు 1,850 ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని చెప్పారని, ఆ భూములు కూడా అటవీ ప్రాంతం నుంచి తీసుకోవాలని చర్చ కూడా జరిగిందని అన్నారు. అందుకు భిన్నంగా, ఇప్పుడు రాజధాని కోసం లక్ష ఎకరాలను సేకరిస్తున్నారని పవన్ మండిపడ్డారు.
తోలు తీస్తారంటూ హెచ్చరిక
'చంద్రబాబు! బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? ప్రజలు తోలు తీస్తారు.. గుర్తుపెట్టుకోండి' అని పవన్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజలను కదిలించే శక్తి తనలో ఉందని, డబ్బుతో తననెవరూ కొనలేరని అన్నారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారని, ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేపడతామని, మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని, సీఎం ఇంటి వద్ద కూర్చుంటామని హెచ్చరించారు.
చూస్తూ ఊరుకోం
అడ్డగోలుగా భూ సేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని, పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు. ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపురం నుంచి ఉప్పెనలా వస్తామన్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు. ‘కేసులు పెడితే ఎదురు తిరగండి, అండగా నేనుంటా' అంటూ పవన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఓ ఎమ్మెల్యే మహిళా అధికారిణి కొట్టినా చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. ఇలాంటి ఎమ్మెల్యేలు రేపు మంత్రులు కూడా అవుతారని, ఇటువంటి వ్యవస్థను తప్పుబట్టాలని అన్నారు.
ఎన్నికల సమయంలోనే పొత్తులు
ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు మాత్రం ఉద్యమాలు చేస్తానని స్పష్టం చేశారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై జనసేనతో కలిసి పోరాటం చేస్తామని, రాజకీయాల్లో కలిసే వెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.