అప్పుడే కేంద్రమంత్రినయ్యేవాడిని, పూర్తి మెజార్టీతో గెలిపిస్తే..: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీకాకుళం: ప్రేమాభిమానాలతో తనను పాలకొండ ప్రజలు నలిపేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
ఎన్టీఆర్ మహానేత అని, ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానే ఉపయోగపడ్డాయని అన్నారు. కోడిరామ్మూర్తి స్ఫూర్తితో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని పవన్ తెలిపారు. యుగేందర్ అనే యువకుడు.. పవన్ చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. చాలా విలువైన బహుమతినిచ్చారని పవన్ ఆ యువకుడిని, అతని తండ్రికి ధన్యవాదాలు తెలిపారు.

జనం నుంచి వచ్చిందే..
జనం సమస్యల నుంచి వచ్చిందే జనసేన పార్ట అని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేతలు మాటలు మార్చారు.. అందుకే తాను జనంలోకి వచ్చానని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మరింత వెనుకండిందని, నిధులు, నీళ్లు, నియామకాలు శ్రీకాకుళం జిల్లాకు అందడం లేదని పవన్ అన్నారు. ఈ కారణంగానే ఏపీతో తెలంగాణ విడిపోయిందని అన్నారు. తాను ఉత్తరాంధ్రలోనే ఓనమాలు దిద్దానని తెలిపారు.

చంద్రబాబుపై ఆగ్రహం
పుష్కరాల కోసం రూ.2వేలు ఖర్చు చేసిన చంద్రబాబు.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం మాత్రం నిధులు కేటాయించడం లేదని పవన్ అన్నారు.
అంతేగాక, హెరిటేజ్ సిబ్బందికి రూ.500కోట్లు ఇచ్చారని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని, నిధులు కేటాయించలేకపోతున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుకు హోదాపై మొదటి నుంచి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే వచ్చేదని పవన్ అన్నారు. ఉత్తరాంధ్రకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేశారు, దోపిడీ చేశారని మండిపడ్డారు. నిధులన్నీ అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని అన్నారు.

కష్టాలు తెలుసుకునేందుకే
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, చెమట పడితే, నలిగిపోతే ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకే పోరాటయాత్రను ప్రారంభించానని పవన్ తెలిపారు. రైతులు, గిరిజనులు, మహిళల కష్టాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. విద్యా, వైద్యం కూడా ఇక్కడ ప్రజలకు అందడం లేదని అన్నారు. సాగునీరు, తాగు నీరు కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీటి కథలు తెలుసుకోవాలి..
ప్రభుత్వాలు గిరిజనులకు, ఆడబిడ్డలకు న్యాయం చేయకపోవడం చాలా బాధ కలిగించిందని పవన్ అన్నారు. జన సైనికులు రైతుల వద్దకు వెళ్లి వారి కన్నీటి కథలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై పోరాటం చేద్దామని అన్నారు. సినిమాల్లోకి రాకముందు కూడా తాను గిరిజన గ్రామాల్లో తిరిగానని పవన్ చెప్పారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దరిస్తామంటూ వచ్చారు కానీ, ఏమీ చేయలేదని పవన్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం వివక్షకు, దోపిడీకి వంచనకు గురైందని అన్నారు. తాము అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

సీఎం.. సీఎం.. అంటే కాదు..
సీఎం సీఎం అంటే తాను సీఎం అయిపోనని, గ్రామాల్లోకి వెళ్లి ప్రతీ రైతు, మహిలలు వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. టీడీపీలా కాకుండా తామంతా ప్రజలతోనే ఉందామని చెప్పారు. జనసేనకు ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. ఇన్ని ప్రభుత్వాలు చూశారు, తమకు అవకాశం ఇవ్వాలన్నారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజలు తిట్టినా పడుతుందని పవన్ చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ అండగా ఉండి గెలిపిస్తే.. తనపై దాడి చేయించారని తెలిపారు. 2019లో తమ ప్రజా ప్రభుత్వం రావాలని అన్నారు. ప్రధాని మోడీ ఏపీకి హోదా ఇవ్వాలని అన్నారు.

పూర్తి మెజార్టీతో మన ప్రభుత్వం వస్తే..
కేంద్రానికి తమ కష్టాలు, నిరుద్యోగం, దారిద్ర్యం చూపించేందుకే తాను పోరాట యాత్ర చేస్తున్నట్లు పవన్ తెలిపారు. హోదాకు టీడీపీ మొదట తూట్లు పొడిచి.. ఇప్పుడు హోదా పాట పడుతోందని మండిపడ్డారు. మహిళలు, దివ్యాంగులకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. గిరిజన ప్రజలకు విద్యా, వైద్యం అందిస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు సాయమందించేందుకు కోసం నిధులు సేకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమకు పింఛను వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం సంపూర్త మెజార్టీ వస్తే.. సీపీసీ రద్దు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. తనకు పదువులే కావాలనుకుంటే 2014లోనే ఎంపీగా పోటీ చేసి, కేంద్రమంత్రినయ్యేవాడినని పవన్ వ్యాఖ్యానించారు. అయితే, సీపీసీ రద్దు అంశం కేంద్రం పరిధిలోనిది కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications