151 స్టిక్కర్లు అంటిస్తారు: పవన్ కల్యాణ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు. సందర్భం దొరికిన ప్రతిసారీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు విశ్రమించేది లేదని, అదే తన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. అందుకనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.
రుషికొండ తవ్వకాలపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరారు. రుషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు. తీర ప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం, చెట్లు, కొండలను నరికేయడం వైసీపీ పాలకుల ముఖ్య లక్షణం అన్నారు. విశాఖపట్నం ఎంతో అందమైన ఊరని, ఇటువంటి పర్యాటక ప్రాంతాలకు కూడా వదలరా? అని ప్రశ్నించారు. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు నిపుణుల ప్యానెల్ నిర్థారించిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకనుగుణంగా టీడీపీ, జనసేన అడుగులు ఉన్నాయంటున్నారు. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన కూడా టీడీపీతో పొత్తు గురించే ప్రధాన అంశమని వైసీపీ నాయకులు మండిపడ్డారు.













Click it and Unblock the Notifications