కీలక నిర్ణయం దిశగా పవన్ - పొత్తుల పై అధికారికంగా: వైసీపీపై కొత్త వ్యూహంతో..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహాల పైన ఇప్పటికే పవన్ ఒక క్లారిటీతో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. పొత్తులతో పాటుగా వైసీపీ తో తీవ్రమవుతున్న రాజకీయ యుద్దంలో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ప్రకటన దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టి రాజకీయ వ్యవహరాల కమిటి సమావేశానికి నిర్ణయించారు.
ఈ నెల 30న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ ముఖ్య నేతలు నాగబాబు..నాదెండ్ల మనోహర్ తో పాటుగా ఇతర నేతలు హాజరు కానున్నారు. విశాఖ పరిణామాలు.. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు..చంద్రబాబు స్వయంగా వచ్చి పవన్ తో సమావేశం కావటం ద్వారా ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు పవన్ చుట్టూ తిరగటం మొదలయ్యాయి. అదే సమయంలో చంద్రబాబు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పవన్ తో మళ్లీ మళ్లీ సమావేశాలు జరగుతాయని స్పష్టం చేసారు. ఇక, వైసీపీ నేతలు పవన్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ తమకు జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్నారు.
టీడీపీ తో పొత్తు ఖాయమనే అంచనాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. కానీ, పవన్ కళ్యాణ్ పొత్తు పైన అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో బీజేపీతో మైత్రి పైన క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా సాధ్యపడుతుందని పవన్ అంచనా వేస్తున్నారు. కానీ, టీడీపీతో కలిసి పని చేసేందుకు బీజేపీ ముందుకు రావటం లేదు. ఈ రెండు పార్టీలు జనసేనతో కలిసేందుకు సిద్దంగా ఉన్నా, మూడు పార్టీలు కలవటం ఇప్పుడు సందేహంగా కనిపిస్తోంది. ఇక, వైసీపీతో పోరాటంలో భాగంగా జిల్లాల పర్యటనలు.. ప్రజలతో మమేకం కావాలనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా బస్సు యాత్ర వచ్చే ఏడాది నిర్వహించినా.. ముందుగా జిల్లాల పర్యటలను ప్రారంభించేందుకు పవన్ సిద్దమయ్యారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. నియోజకవర్గాల వారీ సమీక్షలు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. దీంతో, జనసేన పీఏసీ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.