పబ్లిగ్గా ముద్రగడపై గౌరవాన్ని చాటుకున్న పవన్- జగన్ మళ్లీ గెలిచినా అభ్యంతరం లేదు
అమలాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. ఇవ్వాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తన మాటల దాడి తీవ్రతను పెంచారు. జనసేన అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలనూ ఆయన ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా తనకు అభ్యంతరం లేదని, తనకు ఎవరూ పోటీ ఉండకూడదని బెదిరిస్తే మాత్రం అంగీకరించబోమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుటి వరకు తనలో ఓ నటుడు, రాజకీయ నాయకుడు, జనసేన అధినేతను మాత్రమే చూశారని, విప్లవపంథాను నింపుకొన్న సరికొత్త కోణాన్ని చూడలేదని అన్నారు.

వైఎస్ జగన్పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, అధికారంలోకి వచ్చాక తాను సర్వాధికారిని అని భావించడాన్ని తప్పుపడుతున్నానని పవన్ పేర్కొన్నారు. అందరూ తన బానిసలుగా అనుకునే మనస్తత్వాన్ని వీడనాడాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అవినీతిని చదివి చదవి తన కళ్ల సైట్ పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రశాంతతకు మారుపేరుగా ఉండే గోదావరి జిల్లాల్లో నేరపూరిత వాతావరణాన్ని తీసుకుని రావొద్దని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోన్నానని పేర్కొన్నారు. రౌడీ గ్యాంగ్స్ను పులివెందుల, ఇడుపులపాయలో పెట్టుకోవాలంటూ హితవు పలికారు. ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, గుండెకోతను అనుభవించానని పవన్ చెప్పుకొచ్చారు.
రాజోలు విజయం ఎడారిలో ఒయాసిస్లో అనిపించిందని, పార్టీ తరఫున గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు తమతో లేరని పవన్ అన్నారు. వైసీపీ పాలనలో రాజోలులో గంజాయిలో బాగా అభివృద్ధి చెందుతోందనే సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అపాయింట్మెంట్ అడుగుతానని, ఇక్కడ జరిగే అరాచకాలను వారికి వివరిస్తానని పవన్ చెప్పారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ముద్రగడ కుల ద్రోహిగా అభివర్ణించారు. ఈ ప్లకార్డులను ప్రదర్శించడం పట్ల పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని తొలగించాలని సూచించారు. పెద్దలను గౌరవించాలని అన్నారు. పెద్దలు ఏవో కొన్ని మాటలంటారు.. వాటిని తీసుకోవాలో తప్ప విమర్శించకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications