మళ్లీ పవన్ కళ్యాణ్: రాజధాని రైతులతో భేటీ, చంద్రబాబుతో చర్చలు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరారు. గురువారం మధ్యాహ్నం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం, కేంద్రం, సహాయసహకారాలు, రైతుల స్థితిగతులపై పవన్ బాబుతో చర్చించనున్నట్లు సమాచారం.
అమరావతి శంకుస్థాపనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేలకపోవడం పట్ల చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతులకు గతంలో మద్దతుగా నిలిచిన పవన్, వారి తరపున వకాల్తా పుచ్చుకుని, భూములివ్వడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారో వివరిస్తారని సమాచారం.
ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి ఏమిటో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారని తెలిసింది. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ మీడియా సమావేశంలో మాట్లాడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం ఉదయం పదిన్నర గంటలకు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఆ తర్వాత ఉదయం 11 గంటలకు రాజధాని ప్రాంత రైతులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకుంటారు. వారితో సమావేశమైన తర్వాత మధ్యాహ్నం చంద్రబాబు నాయుడిని కలుసుకుంటారు.