అంతవరకూ అండగా ఉంటా: పవన్, కృతజ్ఞతలంటూ ఫాతిమా విద్యార్థులు
హైదరాబాద్: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు తాను అండగా ఉంటానని
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామి ఇచ్చారు. మూడేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నందుకు ఫాతిమా కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం పవన్ కళ్యాణ్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనను కలిశారని ఆ పార్టీ ప్రెస్నోట్ ద్వారా తెలిపింది.

అండగా ఉంటా..
తనను కలసిన వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. న్యాయం తప్పక విజయం సాధిస్తుందని అన్నారని, విద్యార్థుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు.

న్యాయం చేసేందుకు..
అలాగే ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్సు అమలయ్యే విధంగా కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపింది.

పవన్కు విజ్ఞప్తి
కాగా, ఫాతిమా మెడికల్ కళాశాలకు 2015 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వంద మంది విద్యార్థులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయమని మూడేళ్లుగా ప్రయత్నం చేసి నిరాశ, నిస్పృహలకు గురైన విద్యార్థులు ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.

పవన్ బాసటగా..
కాగా, పవన్ విద్యార్థులకు బాసటగా నిలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిథులతో ఈ సమస్యపై మాట్లాడుతున్నారని జనసేన ప్రెస్నోట్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇటీవలే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్సును విడుదల చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications