టార్గెట్ '19: 'జనసేన' చిత్రం ప్లాన్ చేస్తున్న పవన్కళ్యాణ్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పేరుతో సినిమా చేయాలనే యోచనలో ఉన్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ హైదరాబాదులో జనసేన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 26న విశాఖలో ఇజం పుస్తకాన్ని ఆవిష్కరించి.. జనసేన రాజకీయ అభిప్రాయాలను వెల్లడించారు.
2014 సాధారణ ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉండనున్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లు చీలవద్దని తాను పోటీ చేయడం లేదని, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని, రాష్ట్రంలో అభివృద్ధి ఎవరు చేస్తారనుకుంటే వారికి ఓటేయాలని చెప్పారు. పరోక్షంగా పవన్ టిడిపికి ఓటేయాలని చెప్పినట్లుగా అందరు భావిస్తున్నారు.

పవన్ టార్గెట్ 2019గా ఉంది. ఆ ఎన్నికల వరకు పవన్ తన రాజకీయ పార్టీని పూర్తి పటిష్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పేరుతో ఓ చిత్రాన్ని తీయాలనే యోచనలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పుస్తకం ద్వారా జనసేన అభిప్రాయం చెప్పిన పవన్.. సినిమా ద్వారా మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారట.
ఇదే అంశంతో గతంలో పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి పేరుతో ఓ చిత్రాన్ని తీయాలనుకున్నప్పటికీ.. అనేక కారణాలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే, ఇప్పుడు జనసేన పేరుతో పార్టీ పెట్టినందువల్ల అదే పేరుతో రాజకీయ అంశానికి సంబంధించి చిత్రాన్ని తీయాలను భావిస్తున్నారట.
జనసేన పేరుతో రాజకీయ అభిప్రాయాలు, లక్ష్యాలతో సినిమా తీస్తే అది ప్రజల్లోకి సులభంగా వెళ్తుందని భావిస్తున్నారట. యువత పైన ఆ సినిమా ప్రభావం తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారట. అయితే, పవన్ పార్టీ పెట్టే వరకు దానిని ఎవరు నమ్మలేదంటే ఆశ్చర్యం లేదు. అలాగే.. జనసేన సినిమాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications