Pawan Kalyan: పవన్ మనసులో మాట, ఆ సర్వేతో మారిన వ్యూహం - టీడీపీలో టెన్షన్..!!
మొట్టమొదటిసారి చెబుతున్నా. సీఎం అవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా సిద్ధంగా ఉండాలి..అంటూ జనసేనాని పవన్ తన మనసులో మాట బయట పెట్టారు. ఇదే ఇప్పుడు టీడీపీలో టెన్షన్ కు కారణం అవుతోంది. టీడీపీతో పొత్తు ఖాయమని పవన్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. వారాహి యాత్ర ప్రారంభం తరువాత మాత్రం పవన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలో వైసీపీని ఓడించేందుకు సీఎం పదవిని కాదని పొత్తులకు సిద్దమైనట్లుగా చెప్పుకొచ్చిన పవన్ వైఖరిలో ఈ మార్పు వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
పవన్ కల్యాణ్ మనసులో మాట:
జనసేనాని పవన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. ఈ సారి అసెంబ్లీకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేసిన పవన్..తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని పదే పదే కోరుతున్నారు. పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన చేయటం లేదు. తనకు సంపూర్ణ అధికారం ఇస్తే ఏపీని ఉన్నతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

ఈ ఎన్నికల్లో గెలవటానికి ఏ వ్యూహమైనా అమలు చేస్తానని పవన్ కల్యాణ్ స్పస్టం చేసారు. వైసీపీ..సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రస్తావన చేయటం లేదు. అదే సమయంలో పొత్తుల పైన నిర్ణయం జరగలేదని చెప్పటం ద్వారా రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నారు. ఈ యాత్ర సమయంలో పవన్ గతంలో చెప్పినట్లుగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే వ్యాఖ్యలు చేయటం లేదు.
పొత్తులపై పవన్ తాజా వ్యూహం:పవన్ చేస్తున్న ప్రసంగాలు..వ్యాఖ్యలు..అందులో వ్యూహాల పైన ఇప్పుడు టీడీపీలో చర్చ మొదలైంది. గత రెండు నెలల కాలంలో పవన్ తాను సీఎం పదవికి రేసులో లేనని విస్పష్టంగా చెప్పారు. కానీ, వారాహి యాత్రకు ముందు పవన్ పలు సంస్థలతో సర్వేలు చేయించారు. అందులో తన పార్టీ బలంతో పాటుగా టీడీపీ, వైసీపీ, బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేసారని తెలుస్తోంది.
టీడీపీకి కొన్ని ప్రాంతాల్లో బలం పెరగలేదని ఆ సర్వే నివేదికల్లో స్పష్టం అయినట్లు చెబుతున్నారు. దీని కారణంగానే టీడీపీ చెప్పిన విధంగా తాను నడుచుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లుగా ముఖ్య నేతల సమాచారం. పొత్తుల విషయంలోనూ సరైన సమయంలోనే స్పందించాలనే నిర్ణయానికి పవన్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
పట్టు బిగిస్తున్న జనసేనాని:టీడీపీ ఇచ్చే సీట్లు కంటే..తాను కోరిన సీట్లు టీడీపీని దక్కించుకొనేలా పట్టు సాధించే వ్యూహాన్ని పవన్ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ తోనూ పవన్ ఇంకా పొత్తు తెంచుకోలేదు. ఆప్షన్స్ అన్ని పవన్ ఓపెన్ గానే ఉంచుతున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు ప్రస్తావన చేయకపోయినా..పొత్తు లేదని మాత్రం చెప్పటం లేదు. తాను సీఎం పదవి రేసులో ఉన్నానని తన అభిమానులకు చెప్పటంతో పాటుగా పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టత ఇస్తున్నారు.
పవన్ మార్చిన వ్యూహంతో టీడీపీ అలర్ట్ అవుతోంది. జనసేనతో కాకుండా ఒంటరి పోరుకు టీడీపీ సిద్దంగా లేదని తెలుస్తోంది. అదే సమయంలో మెజార్టీ సీట్లు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా లేదు. టీడీపీ అవసరాన్ని తన అవకాశంగా మలచుకొని..రాజకీయంగా నిలబడాలనేది పవన్ వ్యూహంగా స్పష్టం అవుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఈ పొత్తుల అంశం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications