రాజకీయాలు ఎలా ఉన్నా.. నేతలు ఎంతమంది ఉన్నా.. ఎవరూ ధ్వంసం చేయలేరు: పవన్ కళ్యాణ్
డెహ్రాడూన్: హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత రెండ్రోజుల నుంచి ఆయన హరిద్వార్, రిషికేశ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

తనవంతు కృషి అంటూ..
గంగా హారతి కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గంగా ప్రక్షాళన కార్యక్రమానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానన్నారు.

దక్షిణాది బాధ్యత పవన్కు..
గంగా నదిని కాలుష్యానికి గురికాకుండా మన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు పవన్ కళ్యాణ్. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని ఆ లోటును తీర్చాలని మాత్రిసదన్ ఆశ్రమ ప్రతినిధులు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను కోరారు.

గంగానది ప్రవాహం
గంగా నది ఉత్తర భారతానికో.. పశ్చిమ లేదా తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని.. ఇది యావద్భారతదేశానికి సంబంధించినదని పవన్ కళ్యాణ్ అన్నారు. మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని కాపాడేందుకు.. ఆత్మత్యాగం చేసిన జేడీ అగర్వాల్ స్ఫూర్తితో గంగను పరిరక్షించుకోవడం తన ప్రాథమిక హక్కు అని భావిస్తున్నట్లు చెప్పారు. అగర్వాల్ లాంటి మహాత్ముడి ఆశయాల సాధనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

నా వంతు బాధ్యతగా అంటూ..
తాము ప్రభుత్వంతో పోరాడేందుకు కాకుండా.. తమ వాణిని ప్రభుత్వం చెవిని తాకే వరకూ పోరాడతామని పవన్ కళ్యాణ్ అన్నారు. జేడీ అగర్వాల్ ఆత్మశక్తే తనను ఇక్కడికి వచ్చేలా చేసిందని పవన్ చెప్పారు. అగర్వాల్ సందేశాన్ని యాద్భారతదేశానికి చేర్చేందుకు అవసరమైన నావంతు బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తిస్తామని, అగర్వాల్ ఆత్మశక్తిని వృథాకానీయం అని అన్నారు.

ఎవరూ ధ్వంసం చేయలేరు..
దేశంలో రాజకీయాలు ఎన్నున్నా.. ఎందరు రాజకీయ నాయకులు భావించినా.. దేశ సంస్కృతిక వైభవాన్ని ఎవరూ ధ్వంసం చేయలేరని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చాలా మంది యూరోపియన్ వ్యక్తులు.. భారతదేశంలో ఓ నమ్మకాన్ని ప్రచారం చేయాలని భావించిన సందర్భంలో తత్త్వవేత్త షెఫార్డ్ వారినుద్దేశించిన చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. భారతదేశం మీరనుకున్నట్లు ఎప్పటికీ మారదు.. పైగా అదే మీలో పరివర్తన తెస్తుందని ఆయన అన్నారు.

ముందుకు తీసుకెళ్తా..
దేశంలో సాధుసంతులు ఉన్నారని.. వారు ప్రకృతి కోసం పోరాటాలు చేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ త్యాగాన్ని గౌరవిస్తూ.. ఇప్పటికే ఉద్యమిస్తోన్న వారి సూచనలు, మార్గనిర్దేశకత్వంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications