మళ్లీ అలాంటి పరిస్థితి వద్దు: కరోనా మహమ్మారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్
అమరావతి: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారాన్ని మీడియా ద్వారా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నామన్నారు.

కరోనా వైరస్ విజృంభణపై పవన్ కళ్యాణ్ ఆందోళన
దేశంలో నిన్న(ఆదివారం) ఒక్క రోజే లక్షా 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్షా 59 వేలుగా ఉందంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అందరూ గమనించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 12వందలకు పైగా, తెలంగాణలో 15వందలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ పెరుగుతున్నారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్రమత్తంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు 7.23 లక్షలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన క్రమంలో మనమందరం అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారిని తరిమేద్దామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించండి అంటూ ప్రజలకు పవన్ కల్యాణ్ సూచించారు. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమనిపేర్కొన్నారు.
Recommended Video

ఆ పరిస్థితి వద్దంటూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్
రాబోయే సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించండి అంటూ సూచించారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు టీకా తీసుకొని వారు ఉంటే తప్పనిసరిగా టీకా వేయించుకోవాలంటూ కోరారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా ఉధృతాన్ని కొంతవరకు తగ్గించుకోగలమని సూచించారు. కరోనా సెకండ్ వేవ్లో మందులు, ఆక్సిజన్ దొరకక ప్రజలు అల్లాడిపోయారంటూ పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఎందరినో ఆ సమయంలో మనం కోల్పోయాం.. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ పవన్ ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications