తెలంగాణ అలా రాలేదు: రిజర్వేషన్లపై పవన్, ఆర్ కృష్ణయ్యపై, రామ్మోహన్ నాయుడు కౌంటర్
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు ఈ అంశాన్ని గురించి మాట్లాడారు.
ఆయన ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను సందర్శించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల భేటీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ అలా ఏర్పడలేదు
తెలంగాణ రాష్ట్రం బలప్రదర్శనతో ఏర్పడలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏ ఉద్యమం అయినా నిర్మాణాత్మకంగా సాగాలని అన్నారు. బలప్రదర్శనతో కాపు రిజర్వేషన్లు రావని తేల్చి చెప్పారు. కాపులు ఉద్యమించి రిజర్వేషన్లు పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్ కృష్ణయ్యది ద్వంద్వ నీతి
కాపు రిజర్వేషన్లపై బీసీ నేత, ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తీరును పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. నాడు కాపు రిజర్వేషన్ల అంశాన్ని టిడిపి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆర్ కృష్ణయ్య ఎందుకు అభ్యంతరం చెప్పలేదో చెప్పాలన్నారు. ఇది ఆయన ద్వంద్వం నీతికి నిదర్శనం అన్నారు.

పవన్ కళ్యాణ్కు రామ్మోహన్ నాయుడు కౌంటర్
ఇదిలా ఉండగా, వారసత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. తాను వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినా తనకంటూ ఓ గుర్తింపు ఉందని చెప్పారు. రాజకీయ నాయకులు వారసులు అయినంత మాత్రాన సత్తా లేదనడం సరికాదన్నారు.

ఓ అవకాశం వస్తే కదా, లోకేష్పై సరికాదు
ఓ అవకాశం వస్తేనే కదా మనం ఏమిటో నిరూపించుకునేది అని రామ్మోహన్ నాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. నారా లోకేష్పై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతో అభివృద్ధి చేశారని, తనను తాను నిరూపించుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications