బీజేపీ కోసం తెలంగాణలో పవన్కల్యాణ్ రాజకీయం??
భారతీయ జనతాపార్టీ ఆప్తమిత్రుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా రాజకీయ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదంలో మృతిచెందిన జన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆసరగా ఉండేందుకు రూ.5 లక్షల బీమా పరిహారాన్ని అందించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని, అందుకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం అన్ని దారులను వెదుకుతున్న బీజేపీ
తెలంగాణలో ఎలాగైనా సరై అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతాపార్టీ పెద్దలు అందుకు అన్ని దారులను వెదుకుతున్నారు. ఇప్పటికే కేఏ పాల్ను తెలంగాణపైకి సంధించారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులయ్యేవారు ఉంటారని, నియోజకవర్గానికి 500 చొప్పున ఓట్లు చీలినా చాలు అనే లెక్కలో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అకస్మాత్తుగా పీవీ నరసింహారావు కూతురుకు మద్దతు ప్రకటిస్తూ ఎన్నిక జరిగేరోజు టీఆర్ ఎస్కు మద్దతు పలికారు పవన్ కల్యాణ్.
పోటీచేయకపోతే ఉనికిని కోల్పోతాం
దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలతోపాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీచేయకుండా బీజేపీకి మద్దతిచ్చింది. దీనిపై జనసేన సైనికులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇలా అయితే తెలంగాణలో పార్టీ ఉనికి కోల్పోతుందని, ఇటువంటి త్యాగాలు అవసరం లేదంటూ నిరసన తెలిపారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అధికార పార్టీపై విమర్శలైతే చేయడంలేదు.
కలిసి పోటీచేస్తారా? విడిగా పోటీచేస్తారా?
గత ఎన్నికల్లో అనివార్య కారణాలవల్ల పోటీచేయలేకపోయామని, ఈసారి అటువంటి పరిస్థితి ఉండదని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని పవన్కల్యాణ్ కోరారు. భారతీయ జనతాపార్టీతో కలిసి పోటీచేస్తారా? విడిగా పోటీచేస్తారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే యోచనలో ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీ ఇచ్చే రోడ్మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కూడా సవాల్ విసిరారు. తాము కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు.
అప్పటి పరిస్ఙితులను బట్టి నిర్ణయం?
ఎన్నికల సమయానికి పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని భావిస్తున్నారు. టీఆర్ఎస్ను ఓడించడానికి పవన్కల్యాణ్తో కలిసి పోటీచేస్తే మంచిదా? లేదంటే విడివిడిగా పోటీచేస్తే మంచిదా? అనే యోచనలో బీజేపీ పెద్దలున్నారు. దీనిపై ఒక సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో పవన్పై ఇష్టారాజ్యంగా కామెంట్లు చేసిన బీజేపీ తెలంగాణ నేతలపై పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కేంద్ర పెద్దలతో ఉన్న సఖ్యత ఆధారంగానే కలిసి ముందుకు సాగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు