పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలపై వివాదం: రామ్ చరణ్ విందు గొడవ
విజయవాడ/ హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల తొలగింపు కృష్ణా జిల్లాలో వివాదానికి దారి తీసింది. కృష్ణాజిల్లా గూడూరు మండలం రామన్నపేటలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీపై వివాదం చెలరేగింది. సంక్రాంతి సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ ఫోటోలు ఉన్న ప్లెక్సీని ఏర్పాటు చేశారు.
వీటిని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు పిర్యాదు చేసి, రోడ్డుపై బైఠాయించారు. ఫ్లెక్సీని చించేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, సినీ హీరో రామ్ చరణ్ తేజ్ విందు వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన తన ఇంటి వద్ద స్నేహితులకు విందు ఇచ్చారు. అది వివాదానికి దారి తీసింది.
మీడియా కథనాల ప్రకారం - హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని రామ్ చరణ్ నివాసంలోని టైపై శనివారం రాత్రి ప్రారంభమైన విందు ఆదివారం తెల్లవారు జాము వరకు సాగింది. ఇందులో పలువురు రాజకీయ నాయకుల కుమారులు పాల్గొన్నారు. వారు స్థానికులకు అరుపులు, కేకలతో స్థానికులకు చిరాకు కలిగించారు.
ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న సీనియర్ ఐపిఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ కె. రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని విందు కార్యక్రమాన్ని ఆపేయాలని రామ్ చరణ్ తేజ్ను కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు.