జనంలోకి పవన్ కళ్యాణ్, తెలంగాణలోను భారీ సభలు
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 27న విశాఖలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ సభ తర్వాత జనంలోకి వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
ప్రతి వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ సభ అనంతరం రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని ముఖ్య కేంద్రాల్లో సభలు నిర్వహించాలనుకుంటున్నారు. విశాఖలో నిర్వహించనున్న పవన్ సభకు ఇప్పటికే యువత, అభిమానులు తదితరుల నుండి మంచి స్పందన వస్తోంది.

ఆ సభలో పాల్గొంటామని చాలామంది చెబుతున్నారు. ఈసారి పాసులతో సంబంధం లేకుండా అందర్నీ సభకు అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు యూత్ ఫర్ ది నేషన్, ఫైట్ ఫర్ ది నేషన్ అని సభకు ట్యాగ్ లైన్ పెట్టారు. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక లోగో, గీతాన్ని సోమ, మంగళవారాల్లో ఆవిష్కరిస్తారు. విశాఖ సభలో ఇజం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
కాగా, విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు ప్రచారంగా సోమవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా ప్రతీ గ్రామంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది. విశాఖ సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సభలో పవన్ సుదీర్ఘంగా పార్టీ విధి, విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తారని చెప్పాయి.
తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే పవన్ సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications