రాజధానిపై అసలేంటి: తెలుసుకున్న పవన్, ఏంచేద్దాం: సుజనతో బాబు భేటీ
అమరావతి/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో గుంటూరు జిల్లా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో పవర్ స్టార్కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
గుంటూరు జిల్లాకు చేరుకున్న పవన్ కళ్యాణ్... మంగళగిరి సమీపంలోని ప్రముఖ రిసార్ట్స్ హాయ్ల్యాండ్కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు రైతులు, ప్రముఖుల నుండి.. రాజధాని భూసేకరణకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్నారు.
తాను పర్యటించే పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో భూసేకరణ గురించి పూర్తిగా తెలియకుండా తాను మాట్లాడలేడు. కాబట్టి దానిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తోందని రైతులు వాపోతున్నారు.
పెనుమాకకు పోటెత్తిన అభిమానులు, రైతులు
రాజధాని కోసం భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు పెనుమాకకు పోటెత్తారు. పవన్ కోసం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
మరోవైపు, రాజధానికి భూమి కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద జారీ చేసిన నోటిఫికేషన్ పైన ఆందోళనలు జరుగుతున్నాయి. వామపక్షాలు ఆదివారం ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై ధర్నాకు దిగాయి.
పెద్ద సంఖ్యలో చేరిన వామపక్షాల కార్యకర్తలు బ్యారేజీని దిగ్బంధించారు. దీంతో బ్యారేజీకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించాల్సిందేనని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు.
చంద్రబాబు భేటీ
రాజధాని నిర్మాణం, ఉద్యోగుల తరలింపు, ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి హోదా తదితర అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు.. శనివారం రాత్రి హైదరాబాదు చేరుకున్నారు. అయితే ఏపీ రాజధాని రైతుల పక్షాన భూసేకరణకు వ్యతిరేకంగా పోరు సాగించేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారం రాజధానికి బయలుదేరారు. అదే సమయంలో హోదా పైన రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో చంద్రబాబు తన ఇంటి వద్ద భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్కు భూసేకరణపై అర్థమయ్యేలా చెప్పడం ఎలాగన్న విషయంపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఆదివారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాదు నుంచి నుంచి ఏపీకి రోడ్డు మార్గం మీదుగా బయలుదేరారు. పదకొండు గంటలకు ఆయన పెనుమాక చేరుకుంటారని భావించినా, పన్నెండు గంటల తర్వాత చేరకుంటున్నారు. తమ విలువైన పంట ఉత్పత్తులను పవన్కు చూపిస్తామని, ఇబ్బందులు చెబుతామని రైతులు అంటున్నారు.