బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ పునరాలోచన?
కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇతర పార్టీలన్నింటికీ మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. వ్యవస్థలను ఉపయోగించుకోవడంతోపాటు తమకు వ్యతిరేకంగా ఉండే పార్టీలను, నాయకులను కట్టడి చేయడం, కనీసం వార్డు సభ్యుడే లేని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంలాంటివన్నీ చూసిన తర్వాత వ్యవస్థలను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా? అని ఇతర పార్టీల నేతలంతా నోరెళ్లబెట్టారు.

బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య
వ్యవస్థలను ఇంతలా ఉపయోగించుకొనే బీజేపీకి మనుషులను ఉపయోగించుకోవడమనేది వెన్నతో పెట్టిన విద్యలాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తోన్న వైఖరి కూడా ఇలాగే ఉందంటున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ఆ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమంటూ ప్రతిపాదనలు వచ్చాయికానీ పవన్ నిరాకరించారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో కలిసి 2020 జనవరిలో అధికారికంగా పొత్తులను ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి పవన్ పొత్తు పెట్టుకోవడం మంచిదేనంటూ వార్తలు వెలువడ్డాయి. ఏ సిద్ధాంతాలు, విధానాల ప్రాతిపకదికన పొత్తు పెట్టుకున్నారో ప్రకటించలేదు. వైసీపీ ప్రభుత్వ మూడురాజధానులు వ్యతిరేకంగా విజయవాడ వంతెనపై ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఉమ్మడిగా ప్రకటించిన మొదటి కార్యక్రమం అదే.. చివరి కార్యక్రమం అదే.

ఎవరికి వారే.. యమునా తీరే..
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొని, బహిరంగసభలో ప్రసంగించారు. ఆ తర్వాత ఎవరికివారుగా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంవల్ల రాబోయే ఎన్నికలకు సంబంధించి కేంద్రం నుంచి సహకారం తీసుకోవాలనేది పవన్ యోచనగా ఉంది. అయితే కేంద్ర పెద్దలు మాత్రం విరుద్ధ భావాలతో, వేర్వేరు వైఖరులతో ఉండటంవల్ల జనసేనాని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం మొదటినుంచి చెబుతున్నదేమిటంటే.. ఎన్నికలు 6నెలల సమయం ఉన్నప్పుడు పొత్తుల గురించి మాట్లాడవచ్చు.. ఇప్పుడే ఎందుకు? అంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పై దూకుడుగా రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ కు బీజేపీతో స్నేహం పోరుబాటకు అడ్డం పడుతోందని జనసేన సైనికులు చెబుతున్నారు. తమ ముందరికాళ్లకు బీజేపీ పెద్దలు బంధం వేస్తున్నారని, కొంత వేచిచూసే ధోరణికి తమ నేత వచ్చాడని, తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

పునరాలోచించాలంటున్న జనసేన శ్రేణులు
తాజాగా విశాఖ పర్యటనలోకానీ, ఇప్పటంలోకానీ, గుంకలాం పర్యటనలోకానీ బీజేపీ శ్రేణులెవరూ జనసేనకు మద్దతుగా రాలేదు. పొత్తున్నప్పటికీ చిత్రంగా బీజేపీ తనకేం సంబంధం లేనట్లు ఒంటరిగా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇటీవల అమరావతి ప్రాంతంలో ఉండవల్లి నుంచి తుళ్లూరు వరకు నాలుగురోజుల పాదయాత్ర చేసిన నాయకులు జనసేనను కలుపుకోలేదు. అధికార పార్టీతో పోరాటం చేసే క్రమంలో తమతో బీజేపీ ఏనాడూ కలిసిరాలేదని, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని కొనసాగడం అవసరమా? అని జనసేన శ్రేణులు పవన్ ను ప్రశ్నిస్తున్నాయి. పొత్తు విషయంలో పునరాలోచన చేయాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు.. అండగా నిలబడతారు అన్న ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్... తన లక్ష్యం నెరవేరకపోతుండటంపై పునరాలోచనలో పడ్డారు. కొంతకాలం వేచిచూద్దామనే ధోరణికి వచ్చేశారు.












Click it and Unblock the Notifications