'కాపు'లపై మాట తప్పారు, 'తుని' ఘటనపై బాబుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్/విజయవాడ: కాపు గర్జన నేపథ్యంలో జరిగిన తుని విధ్వంసం పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు స్పందించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నేను కేరళలో షూటింగులో ఉండగా తనకు ఈ విషయం తెలిసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తుని ఘటన చాలా బాధాకరమన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. అప్పుడే విజయవంతం అవుతుందన్నారు. ఈ ఘటన బాధాకరమని చెప్పారు.
కాపుల రిజర్వేషన్ ఉద్యమం ఒక్కరోజులో వచ్చింది కాదన్నారు. బ్రిటిష్ కాలం నుంచి, ఉమ్మడి మద్రాస్ కాలం నుంచి ఉందని చెప్పారు. చాలాకాలం ఈ డిమాండ్ కొనసాగిందన్నారు. దశాబ్దాల డిమాండ్ అన్నారు. ఏ ఉద్యమం అయినా శాంతియుతంగా జరగాలన్నారు.
తెలంగాణలో, కోస్తాంధ్రలో వెనుకబడిన వర్గాలను గుర్తించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని నాయకులు హామీలు ఇచ్చి వదిలేస్తున్నారనే అభిప్రాయం కాపుల్లో ఉందన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునేందుకు ఏర్పాటైన సభ, శాంతియుతంగా ఉండాల్సిన సభ.. విధ్వంసం కావడం బాధాకరమన్నారు.
కాపులను ఓటు బ్యాంకుగా... జాగ్రత్తలు తీసుకోలేదేం
తమను ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారని కాపులు భావిస్తున్నారన్నారు. రైలు కాల్పుల ఘటన చిన్న విషయం కాదన్నారు. అగ్గిపుల్ల గీస్తే రైలు అంటుకోదన్నారు. అసాంఘిక శక్తులు ఉంటే గాని అలాంటి విధ్వంసం జరిగకుండా ఉండదన్నారు. దీనిపై ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్నారు.
ఇది సభకు వచ్చిన వాళ్లు చేసిన సంఘటన కాదన్నారు. ఈ సమస్యకు రాజకీయ రంగు పులుమాలనుకోవడం బాధాకరమన్నారు. రైలు ఘటన వెనుక కచ్చితంగా అసాంఘిక శక్తులు ఉన్నాయన్నారు. లక్షలమంది జనం వస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని కూడా తప్పుబట్టారు.
ఉద్యమాలను హ్యాండిల్ చేయగలగాలి
అనేక తెగలు కలిస్తేనే కాపులు అవుతారని చెప్పారు. రిజర్వేషన్లు అంటే ఒక్క రోజులో వచ్చేవి కావన్నారు. కుల ఉద్యమాలను హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. దేనిని అయినా మొగ్గలోనే తుంచే విధానం మన ప్రభుత్వాల్లో లేదని ఎద్దేవా చేశారు.
తుని ఘటన విషయంలో ఉద్యమ నాయకులకు కూడా బాధ్యత ఉంటుందని చెప్పారు. అలాగే లక్షల మంది సభకు వస్తున్నప్పుడు లా ఆండ్ ఆర్డర్ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టలేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని చాలామంది చెప్పారని విమర్శించారు.
అసాంఘిక శక్తుల పనే
తుని ఘటన మాత్రం కచ్చితంగా సభకు వచ్చిన వాళ్లు చేయలేదని, అసాంఘిక శక్తుల పనే అన్నారు. కమిషన్లను ఏర్పాటు చేయడంతో కాపుల హామీలు నెరవేరవని కాపులు భావిస్తున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే మరిన్ని కుల సమస్యలు పుట్టుకు వస్తాయన్నారు.
ఉద్యమ నాయకులు సరిగా వ్యవహరించకుంటే ఇలాగే జరుగుతాయన్నారు. కాపులను మీమాంసలో పెట్టవద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా చర్యలు తీసుకోవాలన్నారు. కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
అందరితో సంప్రదింపులు జరిపి పరిస్థితిని చేయి దాటకుండా చేస్తే బాగుండేదన్నారు. కాపులకు రిజర్వేషన్ల పైన మీరు ఏమంటారని విలేకరులు ప్రశ్నించగా... నేను ఒక్క కులం కోసం పోరాడటం లేదని, తాను ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. అందరికీ (అన్ని కులాలకు) సమస్యలు ఉన్నాయని చెప్పారు.
తుని ఘటన పైన పోలీసులతో విచారణ జరిపించాలన్నారు. దేశ సమగ్రత కోసం నేను పోరాడుతానని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా లేదా ఓ మాట చెబితే సరిపోతుందన్నారు. ప్రభుత్వంలోని వారు కూడా సహనం వహించాలని చెప్పారు.
బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ అమలు చేయండి
కాపులకు నమ్మకం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కులాల విషయంలో అందరు నేతలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. చేయాలనుకుంటే బీసీలకు ఎలాంటి నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ప్రజలకు ప్రతి విషయం చెప్పక పోవడం వల్లనే ఇబ్బందులు అని అభిప్రాయపడ్డారు.