కుట్రలతో జనసేనానిని ఆపలేరు: పవన్, దుష్టశక్తుల కన్ను, చిత్తూరు, గుంటూరు టూర్ వాయిదా
హైదరాబాద్/అమరావతి: తమ పార్టీపై దుష్టశక్తులు దృష్టి పడిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజల వద్దకు వెళ్లాలన్న తన సంకల్పాన్ని ఎవరు వమ్ము చేయలేరని స్పష్టం చేశారు.
Recommended Video

హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం నిర్వహించినట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. జిల్లాలలో సుదీర్ఘమైన పర్యటనలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

టీడీపీ వైఫల్యాలు, హోదా సాధన
జిల్లాల ప్రధాన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలు, ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా జిల్లాలలో పర్యటిస్తానని పవన్ స్పష్టం చేశారు. తన సుదీర్ఘ పర్యటనల కోసం వివిధ కమిటీలను పార్టీ ముఖ్యులు ఏర్పాటు చేస్తున్నారని, జిల్లాల పర్యటన రెండు మూడు వారాలలో ప్రారంభం అయ్యే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.

జనసేనపై దుష్టశక్తులు కన్ను
జనసేన పార్టీపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూసి భయపడిన కొన్ని స్వార్థపూరిత శక్తుల దుష్ట పన్నాగాలను పోలీస్ నిఘావర్గాలు పసిగట్టాయి. ఏప్రిల్లో చిత్తూరు, గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమాల్లో తునిలో జరిగిన రైలు విధ్వంస వంటి చర్యలకు పాల్పడి ‘జనసేన'కు అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయని ప్రకటనలో పేర్కొంది.

పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలు
అంతేగాక, ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థపరశక్తులు సంప్రదిస్తున్నట్లు నిఘా వర్గాలు పార్టీ నేతలను అప్రమత్తం చేయడంతో ఈ రెండు జిల్లాల్లో తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలిపింది. తొలుత ఏప్రిల్ 21, 22 , 23 తేదీలలో పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమాలను పార్టీ సిద్ధం చేసింది. శెట్టిపల్లెలో భూ సేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైరోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం వంటి ప్రజా సమస్యలపై ఆయన పర్యటనను పార్టీ సిద్ధం చేసింది.

పోలీసు హెచ్చరికలతో..
దీంతోపాటు ఏప్రిల్ 30న గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురం నివాసి, కామన్వెల్త్ క్రీడల్లో విజేత వెయిట్ లిఫ్టర్ వెంకట్ రాహుల్కు బాపట్లలో పౌరసన్మానాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ తలపెట్టారు. ఈ రెండు జిల్లాల్లో కార్యక్రమాల కోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసిన విషయాన్ని ‘జనసేన' పేర్కొంది. కాగా, రెండు మూడు వారాల్లో జిల్లా పర్యటనలుంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications