విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్...తొలిరోజు అరకులో రిసార్టుకే పరిమితం
Recommended Video
విశాఖపట్టణం:విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని అరకులోయ చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పద్మాపురంలోని ఓ రిసార్ట్స్లో బస చేశారు. శనివారం రాత్రికే విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు.
పవన్ ఆదివారం పర్యటన కొనసాగిస్తారా లేదా అనేది ఎటువంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆదివారం వేకువజాము నుంచే పవన్ బస చేసిన రిసార్ట్స్ వద్దకు పోటెత్తారు. అయితే ఆదివారం ఉదయం రిసార్ట్స్ ఆవరణలో మార్నింగ్ వాక్ చేసిన అనంతరం అభిమానులను పలకరించిన పవన్ అరగంట తరువాత తన గదికి వెళ్లిపోయారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించనుండటం గమనార్హం.
అరకు రిసార్ట్స్ లో...పవన్ కళ్యాణ్
శనివారం రాత్రికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్టణం జిల్లాలోకి అడుగుపెట్టడంతో ఆదివారం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందా? లేదా ? అనే సందేహం ఆయన అభిమానుల్లో, జనసేన పార్టీ కార్యకర్తల్లో తలెత్తింది. దీనిపై ఏదైనా ప్రకటన వస్తుందని వారు ఎదురుచూసినట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడంతో ఎలాంటి ప్రకటనా వెలువడలేదు కాబట్టి పర్యటన ఉంటుందని కొందరు...ఉండదని మరికొందరు ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయానికే పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అరకులో ఆయన బసచేసిన రిసార్ట్స్ వద్దకు పవన్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
మార్నింగ్ వాక్...అభిమానులతో సెల్ఫీలు
తాను బస చేసిన రిసార్ట్స్ ఆవరణంలోనే అరగంట పాటు మార్నింగ్ వాక్ చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులను పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. అరకు సందర్శన నిమిత్తం వచ్చి పర్యాటకులు సైతం పవన్ తో ఫోటోలు దిగారు. అనంతరం రిసార్ట్స్ లోకి తిరిగివెల్లిన ఆయన ఆ తరువాత విశాఖ జిల్లాలోని జనసేన ప్రతినిధులు, మన్యంలోని అభిమానులు రిసార్ట్స్లోనే సమావేశమై స్థానిక పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అలాగే జనసేన పార్టీ నేతలతో స్థానిక సమస్యలు, పర్యటన రూపకల్పన తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
చాలామందికి...నిరాశే
అయితే పవన్ రిసార్ట్స్ లో బస విషయం తెలిసి ఆయనను చూసేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులు రిసార్ట్స్ వద్దకు వస్తూనే ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం నుంచే రిసార్ట్స్ మొత్తాన్ని జనసేన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 50 మంది వరకు పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది పవన్ భద్రత పర్యవేక్షిస్తున్నారు. వీరు ముందుగా అనుమతి లేనివారిని ఎవరినీ రిసార్ట్స్ లోపలికి అనుమతించటం లేదు. అయితే తమ అభిమాన నాయకుడిని ఒక్కసారన్నా చూడాలని ఆశతో రిసార్ట్స్కి వచ్చిన, వస్తున్న పర్యటకులు, స్థానికులకు నిరాశే ఎదురవుతోంది.
మరోవైపు...సిఎం చంద్రబాబు టూర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం వరకు విజయనగరంజిల్లాలో పర్యటించి ఆరోజు రాత్రికి విశాఖ జిల్లాలో అడుగుపెట్టగా మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పంలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించే సిఎం చంద్రబాబు ఎస్.కోటలో గ్రామదర్శిని, గ్రామ సభల్లో పాల్గోనున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఎస్.కోట పర్యటన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ తన టూర్ షెడ్యూల్ను మార్చుకున్నారని టిడిపి శ్రేణులు వాదిస్తున్నాయి.