పవన్ కల్యాణ్ ఫ్యాన్ హత్య: కలత చెందిన జూ.ఎన్టీఆర్, ఆరా
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ హత్య సంఘటనపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా కలత చెందినట్లు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఎన్టీఆర్ అన్నట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్కు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి మధ్య జరిగిన తగాదాలో హత్య సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
జనతాగ్యారేజ్ సినిమా విడుదలలో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సంఘటనపై స్పందించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఆరా తీస్తున్నాడని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను అభిమానుల నుంచి ఆయన తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు.
హతుడు వినోద్ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ ఇప్పటికే పరామర్శించారు. చచ్చిపోయేంత అభిమానం మంచిది కాదని కూడా అభిమానులకు హితవు పలికాడు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానులు గొడవపడిన ఘటనలో పవన్ వీరాభిమాని అయిన వినోద్ రాయల్ మరణించిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన తెలుగు సినిమా హీరోలను కలవరుస్తోంది. ఈ సంఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తిగానే మారింది. ఆయన స్పందన కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. హీరోల అభిమానుల మధ్య తగాదాలు అప్పుడప్పుడు జరిగేవే అయినా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లిన ఉదంతాలు లేవని అంటున్నారు.