జనసేన ఫొటోలు: విశాఖ సభకు పవన్ కళ్యాణ్ రెడీ
హైదరాబాద్: జనసేనన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు విశాఖపట్నంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన పార్టీ ఈ నెల 27న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు ప్రచారంగా సోమవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా ప్రతీ గ్రామంలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చింది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘యూత్ ఫర్ నేషన్, ఫైట్ ఫర్ నేషన్' అనే నినాదంతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనట్లుగా 5 నుంచి 6 లక్షల మంది యువతతో ఈ సభ నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు ఆ ప్రకటనలో తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే సభలో పవన్ సుదీర్ఘంగా పార్టీ విధి, విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తారని చెప్పాయి. అలాగే యువత కోసం పవన్ ప్రత్యేక శ్రద్ధతో కంపోజ్ చేయించిన గీతంతోపాటు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన తన స్నేహితుడు సహకారంతో రచించిన ‘ఇజం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పాయి.
నోవాటెల్లో పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి భారీ బహిరంగ సభకావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే పవన్ సన్నిహితులు దగ్గరుండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా ఉండగా పవన్ కల్యాణ్ రెండు, మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీకానున్నట్లు సమాచారం. ఇటీవలే పవన్ గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై, బిజెపి, టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తులు, సర్దుబాట్లు ఏమైనా ఉంటాయా అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.