జనసేనలో అంతర్మథనం ? కీలక పోరులో బీజేపీకి హ్యాండ్- ఇక గుడ్ బై సంకేతాలు
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు మూన్నాళ్ల ముచ్చట అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న ఇరు పార్టీలు.. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు కలిసి పోరాటాలు చేశాయని చూసుకుంటే వేలు మీద లెక్క పెట్టవచ్చు. తాజాగా బీజేపీ టిప్పుసుల్తాన్, గోవధ విషయంలో సాగిస్తున్న పోరుతో వైసీపీ సర్కార్ ఇరుకనపడుతుంటే అటు జనసేన మాత్రం ఈ పోరుకు దూరంగా ఉండిపోతోంది. దీంతో కాషాయంతో జనసేన పొత్తు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తోంది.
Recommended Video
వైసీపీ సర్కార్ పై బీజేపీ దూకుడు
గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కార్ పై బీజేపీ దూకుడు పెంచుతోంది. కీలకమైన టిప్పు సుల్తాన్, గోవధ వంటి అంశాలపై వైసీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి అందించిన అస్త్రాలతో బీజేపీ రెచ్చిపోతోంది. ఛలో ప్రొద్దుటూరు పేరితో తాజాగా బీజేపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బీజేపీ నేతల్ని అరెస్టులు చేసి కడపకు తరలించాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో సహజంగానే ఈ రెండు సున్నిత మైన అంశాలపై బీజేపీకి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ సర్కార్ ఇబ్బందులు పడుతోంది.
కాషాయంతో కలిసిరాని జనసేన
టిప్పుసుల్తాన్, గోవధ అంశాలపై వైసీపీ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ఓ రేంజ్ లో పోరాడుతుంటే దాని మిత్రపక్షం జనసేన మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. కనీసం పత్రికా ప్రకటనలు సైతం ఇచ్చేందుకు జంకుతోంది. దీంతో మిత్రపక్షం జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ పోరు సాగిపోతోంది. అన్నింటికీ మించి జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ మైలైజ్ కూడా సాధించుకుంటోంది. జగన్ సొంతగడ్డ రాయలసీమలో బీజేపీ దూకుడు కొనసాగుతున్నా జనసేన మాత్రం మౌనంగా ఉండిపోతుండటం విశేషం.
క్లైమాక్స్ కు బీజేపీ-జనసేన పొత్తు ?
తాజాగా తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి పూర్తిస్ధాయిలో మద్దతిచ్చినప్పటికీ ఆ పార్టీ అభ్యర్ధి రత్నప్రభ 50 వేల ఓట్లు మాత్రమే సాధించడం జనసేనకు మింగుడుపడలేదు. నేరుగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినా బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో బీజేపీతో కలిసి ముందుకు సాగే విషయంలో జనసేన ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో జనసేన సొంత కార్యక్రమాలతో ముందుకు వెళ్తుండగా.. అటు బీజేపీ కూడా సొంత అజెండాతోనే ముందుకెళ్తోంది. దీంతో వీరిద్దరి పొత్తు క్లైమాక్స్ కు చేరుకుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జనసేన భయం అదేనా ?
రెండేళ్ల క్రితం బీజేపీతో జతకట్టి ఉమ్మడి కార్యక్రమాల్లోనూ పాల్గొన్న చరిత్ర జనసేనకు ఉంది. గతేడాది ఆలయాలపై దాడుల విషయంలోనూ బీజేపీకి జనసేన అండగా నిలిచింది. కానీ దాని తర్వాత మారిన పరిస్ధితుల్లో మైనార్టీ వర్గాలకు జనసేన దూరమవుతుందన్న భయాలు ఆ పార్టీలో మొదలయ్యాయి. దీంతో బీజేపీ చేపట్టే మతపరమైన కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా టిప్పుసుల్తాన్, గోవధ వంటి అంశాలపై బీజేపీ పోరు సాగిస్తున్నా.. జనసేన మాత్రం కలిసి రావడం లేదు. ఓసారి మైనార్టీల వ్యతిరేకిగా ముద్ర పడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న జనసేన.. కాషాయ పోరుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తుపై కూడా ఆశలు పెట్టుకున్న జనసేన..సాధ్యమైనంత త్వరగా బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.