పిల్లవాడిని అనుకుంటున్నారా: మోడీ-బాబులపై పవన్ హెచ్చరిక, రాహుల్ వైపు టర్న్
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
Recommended Video
నా ఇంటికి ఐటీ అధికారులను పంపించారు: పవన్ కళ్యాణ్
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. హోదాతోనే ఏపీకి న్యాయమని, హోదా ఇవ్వకుంటే ఉత్తరాది, దక్షిణాది అనే తేడాలు వస్తాయని కేంద్రాన్ని హెచ్చరించారు.
మోడీ బలమైన వ్యక్తి అని మద్దతిచ్చా
ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుంటే నార్త్, సౌత్ తేడాలు వస్తాయని చెప్పిన పవన్, ఈ విషయాన్ని తాను ప్రధాని నరేంద్ర మోడీతో అప్పుడే చెప్పానని అన్నారు. బలమైన వ్యక్తిగా ఏదైనా చేస్తారనే ఉద్దేశ్యంతోనే తాను మద్దతు పలికానని చెప్పారు.
డిసప్పాయింట్ అయ్యా, గొడవలు ఎందుకొద్దు
కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు తనను డిసప్పాయింట్ చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని చెప్పారు. కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుకోవాలని ప్రశ్నించారు.
వాడుకొని వదిలేశాయని భావిస్తున్నా
2019 ఎన్నికల్లో తన స్టాండ్ ఏమిటో త్వరలో చెబుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరులో జనసేన ఆవిర్భావ సభలో తన స్టాండ్ స్పష్టంగా ప్రకటిస్తానని చెప్పారు. 2014లో తనను టీడీపీ, బీజేపీలు వాడుకొని వదిలేశాయని భావిస్తున్నానని చెప్పారు.
నన్ను చిన్నపిల్లవాడు అనుకుంటున్నాయేమో
గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, బీజేపీలు తనను రాజకీయాల్లో చిన్నపిల్లవాడిని అనుకుంటున్నాయేమో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీయేలో ఉన్నామనుకుంటున్నారా
జనసేన ఇంకా ఎన్డీయేలో ఉందని బీజేపీ, టీడీపీలు భావిస్తున్నాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎన్డీయేలో ఉన్నామో లేదో తనకు తెలియదన్నారు. తాను చాలా ప్రాక్టికల్గా ఉంటానని, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఎలా చెబుతానని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు రాజీనామాలతో పనేమిటి
కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు ఇప్పుడు రాజీనామా చేస్తారని చెబుతున్నారని, ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మాఫియా వాళ్లు కూడా మాట ఇస్తే దనిపై నిలబడతారన్నారు. రాజకీయ నాయకులు మాత్రం మాటపై నిలబడటం లేదన్నారు.
తప్పు చేశామనే భావన కాంగ్రెస్లో
ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుంటే దక్షిణ, ఉత్తరాది మధ్య తేడాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలాగే కొనసాగితే మరో ఇరవై ఏళ్లలో ద్రవిడ ఉద్యమం ముందుకు వస్తుందని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పడం మంచిదేనని, శుభపరిణామం అని పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు చేశామనే భావన కాంగ్రెస్లో వచ్చిందనుకుంటానని చెప్పారు.