చంద్రబాబుతో మాట్లాడాకే చెప్తా: పంచెకట్టులో బయలుదేరిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచెకట్టులో విజయవాడకు బయలుదేరారు. ఆయన ఉదయం పదకొండున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతనే అన్ని విషయాలు చెబుతానని ఆయన అన్నారు. చంద్రబాబుతో భేటీని మర్యాపూర్వకమైందిగానే చూడాలని ఆయన అన్నారు.
చంద్రబాబుతో ఏయే విషయాలపై మాట్లాడేది తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం విజయవాడ బయలుదేరారు. పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు పెద్ద యెత్తున గుమిగూడారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్తారని భావిస్తున్నారు. చంద్రబాబుతో ఏయే విషయాలు మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఇప్పటికే కామినేని శ్రీనివాస్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇరువురి మధ్య భేటీకి కామినేని శ్రీనివాస్ చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం నెరిపినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం, కేంద్రం, సహాయసహకారాలు, రైతుల స్థితిగతులపై పవన్ బాబుతో చర్చించనున్నట్లు సమాచారం.
అమరావతి శంకుస్థాపనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేలకపోవడం పట్ల చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు తెలిసింది. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతులకు గతంలో మద్దతుగా నిలిచిన పవన్, వారి తరపున వకాల్తా పుచ్చుకుని, భూములివ్వడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారో వివరిస్తారని సమాచారం.