బాబూ! చూసుకోండి సార్ అంటే.., నాకంటే గొప్ప నటుడు, కావాలంటే చస్తాను: విభజనపై పవన్
కొవ్వూరు: పార్లమెంటు తలుపులు వేసి రాష్ట్రాన్ని విభజిస్తే కదా జనసేన పుట్టింది, నేను చస్తే చస్తాను, ఉంటే ఉంటాను.. పోతే పోతాను కానీ ఎట్టి పరిస్థితుల్లో తన పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రసక్తి లేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొవ్వూరు బహిరంగ సభలో మాట్లాడారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
లోకేష్ను తీసేయండి, తువ్వాలుతో బయట స్నానం చేశాడు, జగన్లా ముద్దులు పెట్టను: పవన్
పశ్చిమ గోదావరి జిల్లాలో సహజంగా ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఉండవని తాను చంద్రబాబు, జవహర్కు చెబుతున్నానని, కానీ ఇక్కడి యువతలో ఇప్పుడు తీవ్ర అసహనం ఉందని అన్నారు. అదిలాబాద్, శ్రీకాకుళంలో నక్సలిజం ఉండటం వేరు అని, కానీ ఇక్కడి యువత కూడా అన్నా.. మాకు నక్సలైట్లలోకి వెళ్లాలని ఉందని కొంతమంది అంటున్నారని చెప్పారు. ఎవరు కూడా హింసామార్గం ఎంచుకోవాలని కోరుకోరన్నారు.
అలా చేస్తే యువత ఆయుధాలు పట్టుకోదా
చంద్రబాబు వంటి వారు త్యాగాలు చేయకుండా రాజరికాలు చేస్తుంటే, సామాన్యులు త్యాగాలు చేయాలా అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే యువత ఆయుధాలు పట్టుకోకుంటే ఏం చేస్తుందని, కచ్చితంగా ఆయుధాలు పట్టుకుంటుందని, ఈ విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలన్నారు. ఎక్కువ సహనం ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంత కోపం ఉందంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటప్పుడు తీవ్రవాద ఉద్యమాలు రాకుంటే ఏమి వస్తాయన్నారు. లోకేష్ ఒక్కడే యువత కాదన్నారు.
అందుకే చిన్న ప్రాజెక్టులు కట్టరు
ఓట్ల కోసం కులాలను వేరు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కుటుంబాలు బాగుపడుతున్నాయి కాని కులాలు మాత్రం బాగుపడటం లేదన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను పార్టీ పెట్టి, 2014లో టీడీపీ గెలిచిన తర్వాత తాను ప్రపంచ బ్యాంకుకు చెందిన అధికారులతో మాట్లాడానని, వారు ఏం చెప్పారంటే భారతదేశానికి చిన్నపాటి ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిపోతాయని చెప్పారని అన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టుల్లో డబ్బులు రావు కాబట్టి పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటారన్నారు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడైనా మనకు పోరాటం చేసేందుకు హక్కు ఉండేదని, కానీ ఇప్పుడు ఉద్యమిస్తే కులం, మతం అంటగడుతున్నారని చెప్పారు. తాను కులం గురించి పట్టించుకోనని, తాను ఏ పార్టీలోని నేతను అయినా ప్రజప్రతినిధిగా చూస్తానని చెప్పారు. తన కుటుంబంలోని వారిని, చివరకు తనను తాను కూడా ప్రజాప్రతినిధిగానే చూస్తానని చెప్పారు.
ఇసుకను దాచిపెడదామనుకున్నా
2019లో జనసేన ప్రభుత్వం వచ్చినా ప్రజలు తనను ఇలాగే నిలదీయవచ్చునని పవన్ అన్నారు. కానీ తనకు 2019లో ముఖ్యమంత్రి కావాలనే కోరిక, 2024లో అటు వెళ్లాలని, లోకేష్ను సీఎం చేయాలనే కోరిక లేదని చెప్పారు. తను ఇటీవల ఓ దేవాలయానికి వెళ్లానని అక్కడ ఇంకా ఇసుక కొంత మిగిలి ఉందని, దానిని చూసి తాను ఆశ్చర్యపోయానని, టీడీపీ నేతలు ఇంకా ఇసుకను మిగిల్చారా అని అనుకున్నానని, దానిని ఎక్కడైనా దాచిపెడదామా అనుకున్నానని, కానీ మనం దానిని దాచిపెట్టలేం కదా అన్నారు. ఎవరు ఎంత సంపాదించినా ఆరు గజాల్లోనే పూడ్చిపెడతారని అన్నారు. వందలకోట్లు దోపిడీ చేసినా చనిపోతే ఆ డబ్బు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. ఆ డబ్బుతో పోరంబోకు పనులు, వ్యసనాలు అన్నారు.
జవహర్ ముఖ్యమంత్రి అయితే
కొందరికి డబ్బులు సంపాదించడంతోనే సరిపోయేదని, మనలను ఎక్కి తొక్కాలని, మనలను శాసించేలని అనుకుంటారని పవన్ అన్నారు. జవహర్ ముఖ్యమంత్రి అయితే బెల్టు షాపులను మొత్తం వదిలేస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఆయన సీఎం అయితే ప్రతి ఇంటికి ఓ బార్ లైసెన్స్ ఇస్తారని, గడపకో బెల్ట్ షాప్ పెడతారని, రాష్ట్ర ఖజానాను పెంచి శభాష్ అనిపించుకుంటారని ఎద్దేవా చేశారు.
చూసుకోండి సార్ అంటే..
పవన్ కళ్యాణ్ బాగానే ఉండేవారని, మద్దతిచ్చారని చంద్రబాబు అంటుంటారని, కానీ మీరు చేసే పనికి ఎన్నిసార్లు సున్నితంగా చెబుతామని, చూసుకోండి సార్ అని మేం చెబితే అందులో ఎంతో అర్థముంటుందని, ఆవేదనను చెప్పినట్లేనని, మెల్లిగా చెబితే చేవలేక, చాతకాక కాదని, ఇంకా ఎంత కాలం చూస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే నిలదీస్తున్నామన్నారు.
చంద్రబాబు నాకంటే గొప్పనటుడు
కొంతమంది టీడీపీ నేతలు తనపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు దిగజారి మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు టీడీపీకీ మద్దతివ్వడమే అన్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అంతా వైన్ షాపులు పెట్టారని అన్నారు. తెలంగాణలో దోచుకునే ఆంధ్రా నా కోడుకులు అంటుంటే నాకు బాధగా ఉండేదని, ఆ గొడవలో ఏపీ ప్రజలు లేరని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ నేతలు దోచుకున్నారని చెప్పారు. తాను పెద్ద నటుడిని కాదని, తన కంటే టీడీపీ నేతలు గొప్ప నటులు అని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప నటుడి అంటే ప్రత్యేక హోదా గురించి ఆయన ఆరు నెలల క్రితం, ఇప్పుడు అంటున్న మాటలు వీడియోలతో సహా చూపించినా.. అది నేను కాదు, నేను ఎప్పుడూ అనలేదని అంటారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబే అంతగా భయపడతారు
ఇటీవల టీడీపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేనేమైనా మోడీ బంధువునా, ఆయన నా అన్ననా అని ప్రశ్నించారు. అమిత్ షా నాకు ఏమైనా మేనమామనా అని ప్రశ్నించారు. అమిత్ షా వంటి నేతలే నువ్వు పార్టీ నడపలేవు, భవిష్యత్తు జాతీయ పార్టీలదేనని, కాబట్టి నీ పార్టీని బీజేపీలో కలపమని చెప్పారని, అప్పుడే తాను కలపలేదన్నారు. అమిత్ షా అంటే, మోడీ అంటే చంద్రబాబు ఎంతగా భయపడతారో అందరికీ తెలుసునని అన్నారు.
చస్తే.. చస్తాం కానీ బీజేపీలో కలపం
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అంతగా భయపడితే నేను సామాన్యుడిని అని, మహా అయితే 70 కిలోలు ఉండనని, ఇలా అంటే కిందపడతానని, అలాంటి అమిత్ షా అడిగినా పార్టీని కలపలేదని చెప్పారు. ఎందుకంటే తాను సమస్యలపై పోరాడేందుకు జనసేన స్థాపించానని చెప్పారు. పార్లమెంటులో తలుపులు వేసి విడగొడితే కదా జనసేన పెట్టింది, తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతింటే కదా జనసేన పెట్టింది, చస్తే.. చస్తాం కానీ బీజేపీలో ఎప్పటికీ పార్టీని వీలినం చేయమని గొంతు చించుకొని చెప్పారు. ఉంటే ఉంటాం.. పోతేపోతాం, కానీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పారు.