డీజీపీకి వెంటనే పవన్ కళ్యాణ్ కౌంటర్: కానీ 'చెన్నై', 'బాధ్యత' వదిలేశారు!
విశాఖ ఆర్కే బీచ్లో నిరసనలకు అనుమతి లేదన్న డీజీపీ సాంబశివ రావు వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ వెంటనే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
విజయవాడ: విశాఖ ఆర్కే బీచ్లో నిరసనలకు అనుమతి లేదన్న డీజీపీ సాంబశివ రావు వ్యాఖ్యల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
విశాఖలోని ఆర్కే బీచ్లో శాంతియుత నిరసనకు యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. యువత ముందే ప్రణాళిక వేసుకుందని, కాబట్టి అనుమతివ్వాలన్నారు. ప్రజాస్వామ్యంలో వారి హక్కును ఎవరూ కాదనలేరన్నారు.
నిరసన పౌరుడి హక్కు అన్నారు. ఎవరికైతే దేని పైన హామీ ఇచ్చారో, ఆ హామీ నెరవేరనప్పుడు దాని గురించి డిమాండ్ చేసే హక్కు వారికి ఉందని, దానిని ఎవరూ తోసిపుచ్చలేరన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే నిరసన తెలపవచ్చన్నారు.
ఒకవేళ వారికి ఇప్పుడు అనుమతి ఇవ్వకుంటే, వారు మరింత ఉదృతంగా చేపడతారని, కాబట్టి శాంతియుత నిరసనలకు అంగీకరించాలని కోరారు. యువత చేస్తున్న నిరసన రాజకీయాలతో సంబంధం లేదన్నారు. యువతను అశాంతికి గురి చేయవద్దన్నారు.

డీజీపీకి జవాబు చెప్పారు.. కానీ బాధ్యత మాటేమిటి?
ఆర్కే బీచ్లో యువత నిరసనకు అనుమతి లేదన్న డీజీపీ సాంబశివ రావు వ్యాఖ్యల పైన వెంటనే ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఆయన మరో ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.
సోషల్ మీడియా ద్వారా జరిగే ప్రచారానికి ఓనర్ షిప్ ఉండదని, కాబట్టి బాధ్యత ఎవరు తీసుకుంటారో ముందుకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. దీని పైన మాత్రం పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించలేదు.
అంతేకాదు, చెన్నైలో జల్లికట్టు కోసం ఆరు రోజుల పాటు శాంతియుతంగా జరిగిన ఉద్యమం.. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత కూడా హింసాయుతంగా మారిందన్న డీజీపీ వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేదు. జల్లికట్టుకు హోదాకు పోల్చిన పవన్ కళ్యాణ్ వాటి గురించి మాట్లాడాలంటున్నారు.












Click it and Unblock the Notifications