అల్లు అర్జున్పై ప్రశ్న..రిపోర్టర్పై పవన్ కళ్యాణ్ సీరియస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే ఓ మహిళ మరణించారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చారు. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా హీరో అల్లు అర్జున్తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు.

రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ లాభం లేకపోయింది. ఇక మీదట బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు ఓ మీడియా ఛానెల్ ప్రతినిధి.
అల్లు అర్జున్ అరెస్ట్పై మీ స్పందన ఏమిటని పవన్ కల్యాణ్ను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఇది సంబంధం లేని ప్రశ్న అని సమాధానాన్ని దాటవేశారు పవన్ కల్యాణ్.మీ ఫ్యామిలీ మెంబర్ కదా అని మళ్ళీ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాటం ఏమిటని ఎదురు ప్రశ్నించారు. ఇంతకన్నా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించాలని చెప్పి ఆ మీడియా ప్రతినిధిపై అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్పై పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సైతం ఆయన సమాధానం దాట వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.












Click it and Unblock the Notifications