''అతను'' ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు?
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైంది. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే సక్రమమైన అభ్యర్థులు ప్రజల తరఫును ప్రాతినిధ్యం వహిస్తారు. అభివృద్ధి పథంలో ప్రజలను పయనింపచేస్తారు. అభ్యర్థుల చరిత్రను బట్టి ఓటు వేయాలి. ఒకసారిఎన్నుకున్న తర్వాత రీకాల్చేసే వ్యవస్థ భారత్ లో లేదు. ఇక్కడ కూడా రీకాల్ ఉండాలని, తమకు నచ్చని, పనితీరు బాగోలేనిప్రజాప్రతినిధులను ఇంటికి పంపించివేయడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రజాస్వామికవాదులు భావిస్తున్నప్పటికీ అది అమలు కావడం మన నేతలకే ఇష్టంలేదు.

కలుషితమైన రాజకీయం
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయం మొత్తం కలుషితమైపోయింది. ఇటువంటి వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలుకానీ, ఎంపీలుకానీ అదే పార్టీలో ఉంటారనేదానికి నమ్మకం లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటుందో, ఎక్కడైతే వారికి అధికారిక ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తారో వారంతా ఆవైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల ప్రజలు వేసిన ఓటుకు విలువ లేకుండా పోతోంది.

వైసీపీ సీటిస్తుందా? డౌటే?
గతఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ అధికార వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పార్టీ మారకుండా ఉండేందుకు పవన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మాటలను ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారు. ఈలోగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. మరో రెండు సంవత్సరాల సమయమే ఉంది. మళ్ళీ రాజోలు నుంచి ఆయన పోటీచేస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సీటిస్తుందా? అంటే అవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

రాపాకను ఓడించేందుకు..
రాబోయే ఎన్నికల్లో రాపాకు గట్టిగా బుద్ధిచెప్పాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఆయన్ను ఓడించేందుకు మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ను బరిలోకి దింపబోతున్నారు. ఇదే నియోజకవర్గంలోని డిండి గ్రామానికి చెందిన ఆయన ఇటీవలే పార్టీలో చేరారు. నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్న వరప్రసాద్ రాపాకను ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు.. రాజోలులోని జనసేన నాయకులు, కార్యకర్తలు రాపాకపై మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదిరిన పక్షంలో రాజోలు సీటును జనసేన సులభంగా కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications