పవన్ కళ్యాణ్! బాబు నుంచి మీరే కాపాడండి: పొలాల్లో ఫ్లెక్సీలు
అమరావతి: ప్రత్యేక హోదా పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెదవి విప్పాలని, ఆయన బిజెపిని ప్రశ్నించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు హోదా అంశాన్ని పవన్ ముందు ఇప్పటికే కొందరు ఉంచగా... ఆయన ముందుకు తాజాగా రైతులు మరో ప్రతిపాదన తీసుకు వచ్చారు.
తమ భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోదంని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను బలవంతంగా లాక్కోవద్దని వారు చెబుతున్నారు.
ఇందులో భాగంగా వారు.. తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని చెబుతూ పంట పొలాల్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్.. తమ భూములు లాక్కుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నారు.

ప్రభుత్వపు బలవంతపు భూసేకరణ పైన పవన్ నోరు విప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము తమ భూములను ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పంట పొలాల కోసం బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదని, సబ్సిడీలు ఎత్తివేశారంటున్నారు.
చంద్రబాబుతో కలిసి ప్రచారం చేసి, ఆయనకు ఓట్లు వేయించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరైన రీతిలో స్పందించాలన్నారు. పెనుమాక, ఉండవల్లిలలో రైతులు పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 'భూసేకరణ, భూసమీకరణ నుంచి మూడు పంటలు పండే భూమిని మీరే కాపాడాలి' అంటూ రైతులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications