పవన్ కళ్యాణ్ స్పష్టం: వారికి విలువైన మిత్రుడే
హైదరాబాద్: జనసేన పార్టీని పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని వైపులా బాణాలు విసురుతున్నట్లు కనిపించారు. ఆయన కాంగ్రెసుపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుటుంబంపై మొదట్లో విమర్శలు సంధిస్తూ, తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో చెప్పడానికి ప్రయత్నించారు. తన ఉద్దేశ్యాలను, సిద్దాంతాలను చెప్పడానికి ప్రయత్నించారు. తాను ఏం చేయబోతున్నాడు, దేనికోసం మాట్లాడుతున్నారు అని అనిపించారు. కానీ, క్రమంగా ఆయన దిశ రుజుమార్గం తీసుకుంది.
నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత తన వాగ్బాణాలను పవన్ కళ్యాణ్ సూటిగా సంధించారు. తెలంగాణ విషయంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకున్నారు. సీమాంధ్రలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సిన అవసరంపై స్పష్టంగా చెప్పారు. భూకబ్జాలపై, వనరుల దోపిడీపై ఆయన కచ్చితంగా మాట్లాడారు. జగన్ వస్తే సీమాంధ్రకు జరిగే నష్టం గురించి ఆయన చెప్పిన మాటలు ప్రజల్లోకి చాప కింద నీరులా ప్రవహించాయి.

కాగా, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఎన్డియె సమావేశానికి ఆహ్వానించడం ద్వారా పవన్ కళ్యాణ్కు తగిన గుర్తింపు ఇచ్చినట్లు అయింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మరిచిపోబోమని, గుర్తుంచుకుంటామని, తమతో పాటు పాలనలో భాగస్వామివి అవుతావని మోడీ పవన్ కళ్యాణ్కు చెప్పదలుచుకున్నారు.
అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ను విలువైన మిత్రుడిగా చూడదలుచుకున్నట్లు అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలను తీసుకుంటామని చంద్రబాబు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఏమీ ఆశించకుండా దేశ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్తో పని అయిపోయిందనే రీతిలో చూసేందుకు మోడీ, చంద్రబాబు లేరు. ఈ బంధం దీర్ఘకాలం కొనసాగాలని వారు ఆశిస్తున్నారు. వచ్చే హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మంచి ఆయుధం అవుతాడనేది కూడా అర్థమవుతోంది. తాను హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికలపై దృష్టి పెడుతానని పవన్ కళ్యాణ్ అనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications