రాజకీయాలో, సినిమాలో నాకే స్పష్టత లేదు: పవన్ కల్యాణ్
హైదరాబాద్: తాను సినిమాల నుంచి తప్పుకుంటానని చెప్పడమంటే రాజకీయాల్లోకి వస్తానని కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను సినిమాలకు స్వస్తి చెప్పానే మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ విడుదల సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
జర్నలిస్టుల నుంచి వచ్చిన రాజకీయ సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. జర్నలిస్టులు అడిగిన రాజకీయ సంబంధమైన ప్రశ్నలను సున్నితంగా తిరస్కరించారు. సినిమా గురించి మాట్లాడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశానని, రాజకీయ సంబంధమైన ప్రశ్నలు వద్దని అన్నారు.
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై చేస్తున్న ఆందోళన గురించి ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి మీరు ఫిలిం జర్నలిస్టా, పొలిటికల్ జర్నలిస్టా అని అడిగారు. ఆడియో ఫంక్షన్ నిర్వహణకు సహకరించిన తెలంగాణ మంత్రులు హరీష్ రావుకు, కెటి రామారావుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
రాజకీయాలో సినిమాలో తనకే ఇంకా స్పష్టత లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు మాత్రం సినిమాలతో అలసిపోయానని, కొంత విరామం కావాలని ఆయన అన్నారు. సినిమాల్లో నటించకపోతే కథలు రాస్తానని చెప్పారు.
అన్నయ్య చిరంజీవితో కలిసి నటిస్తానని ఆయన చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అన్నయ్య చీరింజీవి వీణ స్టెప్ను ప్రయత్నించినట్లు తెలిపారు. సినిమాలను రాజకీయంగా ఎప్పుడూ చేయలేదని, వినోదంగానే చేశానని ఆయన చెప్పారు. నేపథ్యం అలా ఉంటే ఉండవచ్చునని ఆయన అన్నారు.
ట్విట్టర్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. వర్మ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. బాహుబలిని బ్రేక్ చేయాలని తాను అనుకోవట్లేదని సినిమా కెపాసిటీ ఎంత ఉందో అంతే నడుస్తుందని చెప్పారు. మరో సినిమాతో పోటీ పడాలనే ఆలోచన తనకు లేదన్నారు. ఏప్రిల్ 8నే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల అవుతుందని, తేదీ మారదని పవన్ స్పష్టం చేశారు.