తెరాసకు సలాం, బాబుపై మరోసారి: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వ్యాఖ్యలు చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. జనంలోంచి ఓ వ్యక్తి చంద్రబాబు మాట ఎత్తినప్పుడు - చంద్రబాబు గారా, చాలా మంచి వ్యక్తి అని ఆయన అన్నారు. అందరినీ అదే పనిగా ఎండగడుతామా, చెబుతాను అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వాళ్లు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, వారికి సలాం అని ఆయన అన్నారు. కానీ కాంగ్రెసు నేతలు వైయస్ ఉన్నప్పుడు ఓ వాదన, వెళ్లిపోయిన తర్వాత మరో వాదన చేశారని, వీళ్లను తాను క్షమించబోనని పవన్ కళ్యాణ్ శుక్రవారంనాటి తన ప్రసంగంలో అన్నారు.

దేశం ముఖ్యమా, సమాజం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? అంటే... దేశమే ముఖ్యమని చెబుతానని ఆయన అన్నారు. స్కూళ్లు తెరుస్తారు కానీ, పుస్తకాలు రావని, ఇదీ మన విద్యా వ్యవస్థ అని, పదో తరగతిలో ఉండగానే విప్లవ సాహిత్యం, సాయుధ పోరాటం గురించి చదివానని, తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా అప్పుడే చదివానని, కొందరి మాదిరిగా ఇప్పుడు కొత్తగా ప్రేమ పుట్టి చదవలేదని చెప్పుకున్నారు.
తనకు కులం, మతం, ప్రాంతం తెలియదని, ఏ దేశమంటే భారతదేశమని చెబుతానని ఆయన అన్నారు. ఎవరినైనా 'మిత్రులు' అని అంటాం గానీ తెలంగాణ మిత్రులు, ముస్లిం మిత్రులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అసహ్యం కలిగిస్తోందని, కాంగ్రెస్ నాయకులవల్లే ఇది జరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications