ఇప్పుడు గోల ఏంటి, వాటాలు-పర్సెంటీజీలని నాకు చెప్పారు: టీడీపీపై పవన్ షాకింగ్
Recommended Video

అమరావతి/కడప: కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ తాను కడతానని, లేదంటే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి అంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో టీడీపీ ఆందోళనలు కొనసాగిస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు.
అసలు స్టీల్ ప్లాంట్ రాలేదని టీడీపీ నాయకులు గోల చేస్తున్నారని, కానీ అసలు వారి వల్లే పరిశ్రమ రాలేదని పవన్ నిప్పులు చెరిగారు. అప్పట్లో దీని నిర్మాణం కోసం జిందాల్ సంస్థ ముందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆయా నాయకులకు లబ్ధి చేకూరితేనే కర్మాగారం ఏర్పాటు కావాలా? లేకపోతే కాకూడదా? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? అని టీడీపీని ప్రశ్నించారు.

పరిశ్రమల కోసం కమీషన్లు అడుగుతున్నారని విదేశీ పారిశ్రామికవేత్తలు చెప్పారు
లండన్లో తాను పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు తమ ఆవేదనను చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత వాటాలు, పర్సంటేజీలు ఇస్తారని అడిగే స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోందని, అందుకే తాము రావడం లేదని వారు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం కూడా తనకు అదే కోవలో కనిపిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులను జనసేన, సీపీఎం, సీపీఐ కలిసి మార్చాలనుకుంటున్నాయన్నారు.

ఇంకెవరు కలిసి వచ్చినా కలిసి సాగుతాం
తమ మూడు పార్టీలు ఒకే ఆలోచన విధానంతో ఉన్నాయని, తమతో పాటు ఇంకెవరైనా కలిసి వచ్చినా వారితో కలిసి ముందుకెళ్తామని పవన్ తెలిపారు. మూడు, నాలుగు నెలల తర్వాత అందరం కలిసి ఉమ్మడి కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగం పెరిగి, యువతలో అసాంతి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

29న బంద్కు మద్దతు
కడప ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న బంద్కు జనసేన మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వామపక్షాలదీ తమదీ ఒకే భావజాలమన్నారు. సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తాయన్నారు. కాగా, ఆదివారం సాయంత్రం పవన్తో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలోని జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వీరిద్దరు కలిసి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ కూడా వస్తారు
ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగి మెరుగైన ప్రభుత్వం రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. అలాగని చంద్రబాబు గద్దె దిగితే జగన్ రావడం కాదని, వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న జగన్ సీఎం పదవి ఆశించడం సిగ్గు చేటన్నారు. ఇసుక మాఫియా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని తాము చెబితే బాగుందని చెప్పి ఇప్పుడు ఆ విధానాన్ని మారుస్తున్నారన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం ఈ నెల 29న ప్రతిపక్షాలు నిర్వహించే జిల్లా బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామని, దానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విభజన హామీల సాధనకు జనసేన, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలన్నీ కలిసి ఉద్యమిస్తాయన్నారు. సెప్టెంబరులో విజయవాడలో నిర్వహించే భారీ ప్రదర్శనలో పవన్ వస్తారని చెప్పారు.
భూసేకరణ చట్టంపై పవన్ కళ్యాణ్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2013 భూసేకరణ చట్టం అమలుపై జేఏసీ నేతలతో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ట్వీట్ చేశారు. జేఏసీ నేతలతో ఈ యాక్ట్ గురించి చర్చించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications