జగన్ను విమర్శిస్తే సహించలేరు, రోడ్డెక్కుతా: ఎవరితోనూ పొత్తు లేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
ప్రకాశం: తాను ఎవరికీ దత్త పుత్రుడిని కాదని.. తాను ప్రజల దత్త పుత్రుడినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలురైతు భరోసా యాత్ర నిర్వహించిన పవన్ .. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. మొత్తం 80 మంది కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

అసమర్థుల పాలనలో ఏపీ..: పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జనసేనకు ప్రజలతోనే పొత్తు ఉందని.. రాష్ట్రం బాగుకోసం తమను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రకాశం జిల్లా నుంచి వలసలు బాగా పెరిగాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల వద్ద మాత్రమే డబ్బు ఉందని, సామాన్య ప్రజలు పొట్ట చేతపట్టుకొని వలసలు పోతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా దుస్థితిని మార్చేందుకు మహిళలు కొంగు బిగించాలి జనసేనాని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ.. ఆంధ్రకు అన్యాయమే జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. అయినా అధికార పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని అన్నారు.
బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికే పార్లమెంటు, అసెంబ్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. అందుకే బాధ్యత కలిగిన వ్యక్తులను చట్ట సభలకు పంపించాలను కోరారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గనుల కోసం.. వైసీపీ నేతలు ఎందుకు గట్టిగా అడగరు అని నిలదీశారు పవన్ కళ్యాణ్.

తాను ప్రజలకే దత్తపుత్రుడినంటూ వపన్ కళ్యాణ్
తనను దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. తాను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడినే అని అన్నారు. మీరు మాత్రం సీబీఐ దత్తపుత్రుడేనని.. కేసులు ఎదుర్కోవాల్సిందేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. జగన్ను విమర్శించే సహించలేరని అన్నారు. మన దగ్గర క్రిమినల్ కేసులున్న యువతకు ఉద్యోగాలు రావు అన్న పవన్.. క్రిమినల్ కేసులుండే నాయకులు మాత్రం ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీచేసే వారికి నియమ నిబంధనలు వర్తించవా? అని నిలదీశారు. ఒకసారి గెలిస్తే ఐదేళ్లపాటు ఏం చేయలేరనే ధీమాతో ఉన్నారని, సరిగా పనిచేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాలని అభిప్రాయపడ్డారు.

దసరా తర్వాత రోడ్డెక్కుతానంటూ పవన్ కళ్యాణ్
తాను సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు పవన్. సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను తయారు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. సొంత జేబులు నింపుకునే వాళ్లను కాకుండా.. బాధ్యత కలిగిన వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు.
వైసీపీ ప్రభుత్వం రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, అవి ఏం చేశారని అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడగండని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను ఆదరించాలని ప్రజలను కోరారు. దసరా వరకు వైకాపా నేతలు ఏమన్నా పట్టించుకోబోమన్న పవన్.. ప్రజల సమస్యలు వినడానికి దసరా తర్వాత రోడ్డెక్కుతామని, అప్పుడు వాళ్లకు ఉంటుందని వైసీపీ నేతలనుద్దేశించి అన్నారు.

తమకు ఎవరీతోనూ పొత్తు లేదంటూ పవన్ కళ్యాణ్
రైతులకు రూ.2వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారన్న పవన్.. ఏ జిల్లాకు ఎంత ఇచ్చారో వివరంగా చెప్పట్లేదన్నారు. 2024లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారని, రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని, కౌలు రైతుల కష్టాలు తీర్చేందుకు మాత్రం ఉపయోగించడంలేదని పవన్ విమర్శించారు. జనసేనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు పవన్ కళ్యాణ్.
అధికారంలోకి వచ్చిన వెటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. తమకు ఎవరీతోనూ పొత్తులేదని.. ప్రజలతోనే ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని మోడీతోనే విభేదించానని, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో గొడవ పెట్టుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని.. ప్రజలు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications