చంద్రబాబు- పవన్ నెత్తిన పాలు పోసిన మోదీ
Pawan Kalyan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల హడావుడీ నెలకొంటోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేసింది వైఎస్ఆర్సీపీ.
ఈ దిశగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో- ఆ పార్టీకి కేటాయించాల్సిన నియోజకవర్గాలను వడపోస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య లోక్సభ/అసెంబ్లీ సీట్ల పంపకాల వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.

ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓడిపోతామనే భయంతోనే వైఎస్ఆర్సీపీ నేతలు కాపులను తనపై రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీ నేతల వలలో కాపులు ఎవరూ చిక్కుకోవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నానని, తిట్టిన వారిని కుడా అక్కున చేర్చుకుంటామని, జనసేన తలుపులు తెరిచే ఉంటాయని ఆహ్వానించారు.
వచ్చే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారని, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పవన్ ధీమా వ్యక్తం చేశారు. కాపుల్లో నెలకొన్న ఈ ఐక్యత.. వైఎస్ఆర్సీపీ ఓటమికి దారి తీస్తుందని, ఆ భయంతోనే అంతర్గత విభేదాలను తీసుకోస్తోందని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన పార్టీ పొత్తుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన ఆశీస్సులతోనే పొత్తు పెట్టుకున్నామని, రాష్ట్రాభివృద్ధి కోసం అడుగులు వేస్తోన్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దానికి ఓ బలమైన కారణం ఉంటుందని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని పవన్ వ్యాఖ్యానించారు.
టీడీపీ- జనసేన పొత్తు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయని, ఇదే వైసీపీ పతనానికి నాంది పలుకుతుందని పవన్ పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ప్రకటించిన జగన్ను ఆ సామాజిక వర్గ నాయకులందరూ ప్రశ్నించాలని సూచించారు. కాపులను కాపులతోనే తిట్టిస్తోన్నాడని, వైసీపీ విషపూరిత ప్రచారాలు, తప్పుడు అభిప్రాయాలతో కూడిన వార్తలను విశ్వసించవద్దని కోరారు.












Click it and Unblock the Notifications