ఎంగిలాకులు ఎత్తేవాడినా సంతోషం, యుద్ధ ట్యాంకులు వచ్చినా: పవన్ కళ్యాణ్ ఆవేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు చేనేత గర్జన సభకు హాజరయ్యారు.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు మంగళగిరిలో చేనేత గర్జన సభకు హాజరయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం 75 మంది దీక్ష చేపట్టారు. వారికి పవన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
'మా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు': చంద్రబాబుకు వార్నింగ్
పవన్ కళ్యాణ్ చేపట్టిన చేనేత బ్రాండ్ అంబాసిడర్ కార్యక్రమం విజయవంతం కావాలని పండితులు వేదమంత్రాలు పఠించి, అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో వారి మంత్రాలు వింటూ పవన్ పడిపడి నవ్వారు. తన నవ్వును నియంత్రించుకునే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు.
అనంతరం పవన్ మాట్లాడారు. సినిమాలకు పైరసీ ఎలాంటిదో.. చేనేతకు పవర్ లూమ్ అలాంటిదన్నారు. నోట్ల రద్దుతో చేనేత కార్మికులతో పాటు స్వర్ణకారులు బాగా నష్టపోయారన్నారు.
హోదా టు వారసత్వం.. నాయకుడంటే, చెప్పీ చెప్పీ: పవన్ కౌంటర్ ఇలా
డీమానిటైజేషన్ వల్ల డబ్బున్న వారు ఇబ్బంది పడలేదని, కేవలం మధ్య, పేదతరగతి వాళ్లే ఇబ్బంది పడ్డారన్నారు. వారికి అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. రాజకీయం మురికి అన్న వ్యాఖ్యలపై.. తాను ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, మురికి ఒంటికేనని, లోపలి మనసు శుద్ధిగా ఉంటే చాలన్నారు.
2019లో తప్పకుండా పోటీ చేస్తానని ప్రజల నుంచే పార్టీ ఎన్నికల ప్రణాళిక తీసుకుంటానని, మార్చి 14న వెబ్ సైట్ ప్రారంభిస్తానని పవన్ చెప్పారు. ప్రసంగం చివర్లో.. తాను ఎక్కడకు వెళ్లినా ఈ మాట చెప్పకుండా స్టేజ్ దిగనని చెప్పి.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అని చెప్పారు.
సత్యాగ్రహం అంటే.. ఈ ముగ్గురంటే నాకు గౌరవం
ఎవరైనా సత్యాగ్రహం చేశారంటే.. దానికి అర్థం సత్య ఆగ్రహం అన్నారు. అంటే నిజం తాలుకు కోపం అని విడమరిచి చెప్పారు. తనకు రైతన్న, నేతన్న, జవాన్లు అంటే అంతులేని గౌరవం అని చెప్పారు. చేనేత అనేది బట్టలు ఒంటికి కప్పుకోవడానికే కాదని.. మన దేశ సంస్కృతిని, సమగ్రతను గౌరవించుకోవడం అన్నారు.
చేనేత కళాకారులు
బట్టలు నేసేవాళ్లు చేనేత కార్మికులు కాదని చేనేత కళాకారులు పవన్ కళ్యాణ్ అన్నారు. తన చిన్నప్పుడు తమ ఇంటి పక్కన చేనేత కుటుంబాలు ఉండేవని, వారి తీవ్ర ఇబ్బందులు పడటాన్ని చూశానని చెప్పారు.
పెద్ద కంపెనీలతో నాకు కోట్లు వస్తాయి
తాను ఈ రోజు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి కారణం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎక్కడ ఇబ్బందులు, ఎవరు పేదవారో వారికి అండగా ఉంటానని చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీలకు తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే నాకు కోట్లు వస్తాయని, కానీ తనకు అలా వద్దన్నారు. దాంతో తనకు సంతోషం ఉండదని చెప్పారు. కమర్షియల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఆత్మసంతృప్తి ఉండదన్నారు.
రెండు ఎంగిలాకులు ఉన్నవాడినంటే బాధలేదు
తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానంటే.. కొందరు తనపై విమర్శలు చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. వడ్డించే వాడి వద్దకు కాకుండా.. రెండు ఎంగిలాకులు ఉన్న వాడి వద్దకు వెళ్తున్నారని, కానీ దాని గురించి తాను బాధపడటం లేదన్నారు. విస్తరాకులు ఎత్తేవాడిగా నన్ను పోల్చినందుకు గర్విస్తున్నానని చెప్పారు. సామెతలు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాట్లాడవద్దని హెచ్చరించారు. ఇలాంటి మాటలతో కులవృత్తులను అవమానించవద్దన్నారు. ప్రపంచంలో శుభ్రపరిచే వారు లేకపోతే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు.
అందుకే జనసేన పెట్టా
రాజకీయ నేతలకు మనవి అని పవన్ చెప్పారు. తాను అధికారం ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సామాజిక సేవ కోసమే వచ్చానన్నారు. ఎవరికి కష్టాలు ఉన్నాయో, ఎవరికి ప్రభుత్వాలు అండగా లేవో వారి తరఫున ఉండేందుకు జనసేన పెట్టానని చెప్పారు. కేవలం అధికారం వల్లే ప్రజలకు సేవ చేయవచ్చుననే ఉద్దేశ్యం నాకు లేదన్నారు.
జనసేన అండగా ఉంటుంది
2019లో తప్పకుండా పోటీ చేస్తా
కాకపోతే అవసరమైన మేరకు 2019లో పోటీ చేస్తానని చెప్పానని పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. అలాగే, చేనేత కార్మికుల గొంతు అసెంబ్లీలో గట్టిగా వినిపించేలా జనసేన వారికి అండగా ఉంటుందని చెప్పారు. 11 రకాల వృత్తులు కేవలం చేతి మీదే తయారు చేయాలన్నారు. పవర్ లూమ్స్ వల్ల అదీ తగ్గిపోతుందన్నారు.
గబ్బర్ సింగ్ కాదు.. సామాన్యుడి శక్తి
తన మెడ పైన ఉన్న కండువాను చూపించి.. ఇది సామాన్యుడి శక్తి అని, ఇది గబ్బర్ సింగ్ శక్తి కాదన్నారు. అందరు కూడా చేనేత దుస్తులు ధరించాలన్నారు. బ్రాండ్ అంబాసిడర్గా శీతల పానీయాలు తాగమని తాను చెప్పడం లేదని.. కానీ ఓ వృత్తిని కాపాడమని చెబుతున్నానని అన్నారు. గాంధీ గారు వడికిన చేనేతను మనం కాపాడాలన్నారు.
సుభిక్షంగా ఉండదు
అన్నం పెట్టే రైతు, బట్టలు ఇచ్చే చేనేతలు కానీ కన్నీరు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదన్నారు. అది సుభిక్షమైన దేశం కాబోదన్నారు. కులవృత్తులను కించపరచవద్దన్నారు. చేనేత యువతకు మంచి చదువు ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నానని చెప్పారు.
నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
చేనేత కార్మికులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. చేనేత కోసం ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పురోగతికి మానిటరింగ్ కమిటీ వేయాలన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడాలన్నారు. ప్రపంచంలోని తెలుగు వారు వారానికి ఒకసారి చేనేత దుస్తులు ధరించాలన్నారు.
యుద్ధ ట్యాంకులు వచ్చినా.. దమ్మున్న నేతలు కావాలని ఆవేశంగా..
ఈ మార్చి 14కు తాను జనసేనను పెట్టి మూడేళ్లవుతుందని పవన్ చెప్పారు. తన, పర బేధం లేకుండా తాను ప్రశ్నిస్తానని చెప్పారు. తనకు దమ్మున్న నాయకులు కావాలని ఆవేశంగా చెప్పారు. మీలోని యువశక్తి కావాలన్నారు. ప్రజా సేవకు అధికారం అవసరం లేదన్నారు. యుద్ద ట్యాంకులు వచ్చినా నిలబడే దమ్మున్న నేతలు కావాలన్నారు.
వారసత్వ రాజకీయాలపై..
తనకు వారసత్వ రాజకీయాల పైన వ్యతిరేకత లేదని పవన్ చెప్పారు. కానీ రుద్దవద్దని అభిప్రాయపడ్డారు. తాను విశ్వాసం ఉన్న నాయకుల కోసం, ప్రజలకోసం పని చేసే నాయకుల కోసం చూస్తున్నానని చెప్పారు. సామాజిక మార్పు కోసమే పార్టీ పెట్టానని చెప్పారు.
పవన్కు ఏం తెలియదా
కొందరు పవన్కు ఏమీ తెలియదని చెబుతున్నారని టిడిపిని ఉద్దేశించి మూర్తి అనే చేనేత నాయకుడు వ్యాఖ్యానించారు. తమ వెనుక పవన్ ఉన్నారని చెప్పారు.
చేనేత కుటుంబం వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలి
చేనేత సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు మాట్లాడుతూ.. నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో రైతు రుణమాఫీ తర్వాత చేనేత రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. కానీ రెండున్నరేళ్లు అయినా రుణమాఫీ కాలేదన్నారు.
పద్మశాలీలు, అనుబంధ కులాలు 18 ఉన్నాయని, కానీ తమ వారికి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేయాలన్నారు. చేనేత కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
చేనేత మగ్గాలను పరిశీలించిన పవన్
పవన్ కళ్యాణ్ స్టేజి పైకి రాగానే అందరి మధ్య కూర్చున్నారు. నవ్వుతూ అందర్నీ పలకరించారు. అనంతరం లేచి నిలబడి.. సభకు వచ్చిన వారికి అభివాదం చేశారు. అనంతరం చేనేత మగ్గాలను పరిశీలించారు.