ఆ విషయంలో హెచ్చరికలు, పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దు
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. తాను ఫిబ్రవరి 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తానని కొద్ది రోజుల క్రితం చెప్పారు. సుదీర్ఘకాలంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు, తమను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న వారి డిమాండుకు మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించాలని పవన్ భావించారు.
అయితే అనూహ్యంగా ఇది రద్దయింది. మత్స్యకారులను ఎస్టీల్లో కలపాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. పదిహేను రోజుల క్రితం పుదుచ్చేరి కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఏపీ మత్స్యకార సంఘాలు చంద్రబాబును కలిశాయి.
పవన్ కళ్యాణ్ వారికి ఇలా హామీ
ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. మత్స్యకారుల సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలని, వారిని ఎస్టీ జాబితాలో ఉండాలన్నారు. మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసునని, వారిని ఎస్టీల్లో చేర్చే ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం వారి దీక్షను అడ్డుకోవద్దని కూడా సూచించారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఆదివాసీల ఆగ్రహం
అయితే, పవన్ కళ్యాణ్ను మత్స్యకారులను కలవడం, వారు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండుకు పవన్ మద్దతివ్వడంపై వారు మండిపడ్డారు. వారిని ఎస్టీల్లో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు.
ఆదివాసీ నేత మండిపాటు
మత్స్యకారుల డిమాండుకు పవన్ మద్దతు పలకడంపై ఆదివాసీల నేత గుర్నాథం మండిపడ్డారు. పవన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారులకు ఎస్టీ జాబితా విషయంలో మద్దతు పలికాడని మండిపడ్డారు. కులాలు, జాతుల వ్యవహారాలు, స్థితుగతులు తెలియని పవన్ పనికిమాలిన ప్రకటనలు మానుకోవాలన్నారు. అయతే, ఆ తర్వాత ఆయన తన ప్రకటనపై వివరణ ఇచ్చారు.
ఆదివాసీల దీక్ష విరమణ
ఇదిలా ఉండగా, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ రిలే దీక్షలు చేస్తున్న మత్స్యకారులు దీక్షను విరమించారు. హోంమంత్రి చినరాజప్ప వారిచే దీక్షను విరమింప చేశారు. మత్స్యకారులకు న్యాయం చేస్తామని, సమస్య పరిష్కారానికి చంద్రబాబుతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. దీంతో మత్స్యకారులు తాత్కాలికంగా దీక్షను విరమించారు. వారు 56 రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహించారు.